
సిద్దిపేట రూరల్, వెలుగు: డాక్టర్లు సమయపాలన పాటించాలని కలెక్టర్ కే. హైమావతి అన్నారు. బుధవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందిస్తున్న వివిధ ఆరోగ్య సేవలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ ముక్తి అభియాన్ ద్వారా జిల్లాలో చేపడుతున్న ఆరోగ్య సేవలను ఆఫీసర్ ద్వారా తెలుసుకుని, టబీ స్క్రీనింగ్ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సీ సెక్షన్ ఆపరేషన్లు, మాతాశిశు మరణాలను తగ్గించడంపై సూచనలు చేసారు.
పీహెచ్సీ ల వారీగా సంవత్సర కాలంలో జరిగిన శిశు మరణాలపై పూర్తి నివేదికను అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో డాక్టర్ బి. పల్వన్ కుమార్, సిద్దిపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డాక్టర్ శాంత, ప్రభుత్వ గజ్వేల్ హాస్పిటల్ డాక్టర్ అన్నపూర్ణ, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ వో లు డాక్టర్ రేవతి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఆనంద్ డాక్టర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ స్టూడెంట్స్ మంచిగా చదివి పేద ప్రజలకు సేవ చేయాలని, ర్యాగింగ్ పేరుతో జూనియర్ లను ఇబ్బందులు పెట్టొద్దని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అన్నారు. బుధవారం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను ఆమె సందర్శించి, కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సిబ్బంది తో కాలేజ్ లో వైద్య కోర్సుల వివరాలు, విద్యార్థులకు బోధించడానికి అవసరమైన పరికరాలు, ప్రాక్టికల్స్ చేయడానికి ల్యాబ్ లు, సెక్యూరిటీ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.