- మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
పరకాల, వెలుగు : ‘రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేనోళ్లు.. ఇప్పుడెట్ల అభివృద్ధి చేస్తారు.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, అధికారంలో ఉన్నప్పుడు దొర పోకడ తప్ప పేదోల కష్టాలు తెలుసుకోలేదు’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎంపీ కడియం కావ్యతో కలిసి ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరేనని చెప్పారని.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సన్నబియ్యం పండించే రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ డబ్బులు కూడా చెల్లిస్తున్నామన్నారు.
‘ప్రస్తుతం ఉన్నది దొరల పాలన కాదు.. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల సంక్షేమ ప్రభుత్వం’ అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం పంపిణీ చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వకుండా కమీషన్ల కోసం రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారని విమర్శించారు. మొదట విడతగా రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, ఏప్రిల్లో రెండో విడతతో పాటు మరో మూడు విడతల్లో ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
గత సర్కార్ మూతపడ్డ కోళ్లఫామ్స్, రైస్మిల్లుల్లో హాస్టళ్లు ఏర్పాటు చేస్తే.. తమ ప్రభుత్వం మాత్రం రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తోందన్నారు. పరకాలలో ముంపు నివారణకు రెండు విడతల్లో రూ.35 కోట్లు మంజూరు చేస్తానన్నారు. త్వరలోనే వంద పడకల హాస్పిటల్ను ప్రారంభించుకోబోతున్నామని, మామునూరు ఎయిర్పోర్టును కూడా ఓపెన్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు.
