
- ప్రభుత్వమే మీ ఇంటికొచ్చి ఫిర్యాదులు తీసుకుంటది
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
పాలకుర్తి, వెలుగు : భూభారతి చట్టం ద్వారా ఆగస్టు 15 నాటికి భూ సమస్యలను పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తిలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25 వరకు భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఆర్డీవో, తహసీల్దార్ వంటి ఆఫీసర్లే ప్రజల ఇంటికి వచ్చి ఫిర్యాదులు తీసుకుంటారని, వాటిని అదే గ్రామంలో పరిష్కరిస్తారని చెప్పారు. సర్వేయర్ల సమస్య పరిష్కారానికి ఆరు వేల మంది లైసెన్డ్ సర్వేయర్లను నియమిస్తున్నామన్నారు.
పేదల కోసం 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇల్లు రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని, విడతల వారీగా అర్హులైనవారందరికీ సుమారు 20 లక్షల ఇండ్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు భారీ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయని, వాటిని వెరిఫై చేసిన తర్వాత అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని చెప్పారు. రాజకీయంగా చచ్చిన పాములు ప్రస్తుతం తోక జాడిస్తున్నాయని, ఈ ప్రభుత్వంలో అలాంటి కుట్రలు నడువవన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఉన్నారు.
ఎంజీఎం, కేఎంసీ బలోపేతానికి 10 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి
వరంగల్, వెలుగు : వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్తో పాటు కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (ప్రధానమంత్రి స్వస్త్య సురక్ష యోజన) సేవల్లో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. వీటి బలోపేతానికి 10 రోజుల్లో రిపోర్ట్ అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం ఖిలా వరంగల్లో ఆవిర్భావ వేడుకల అనంతరం కలెక్టర్, హాస్పిటల్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఆయా హాస్పిటళ్ల ఆఫీసర్లు, డాక్టర్లు అలసత్వం వీడాలని సూచించారు.
హాస్పిటల్స్పై ప్రజలకు నమ్మకం పెంచేలా సేవలు అందించాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, పరికరాలు సమకూర్చుకోవాలని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, ఎంజీఎం, పీఎంఎస్ఎస్వై సూపరింటెండెంట్లు డాక్టర్ కిశోర్, డాక్టర్ రాంకుమార్రెడ్డి పాల్గొన్నారు.