24 గంటల్లో పెండింగ్‍ ప్రొసీడింగ్స్ ఇవ్వాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

24 గంటల్లో పెండింగ్‍  ప్రొసీడింగ్స్ ఇవ్వాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో ప్రజలే ముఖ్యం 
  • ఉమ్మడి వరంగల్‍ జిల్లా రివ్యూ మీటింగ్ లో  అధికారులపై  మంత్రి పొంగులేటి అసహనం 

వరంగల్‍, వెలుగు: “రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని తాపత్రయ పడుతుంటే.. దరఖాస్తులను వెంటనే క్లియర్‍ చేయకుండా ఏం చేస్తున్రు..? ఫ్రేమ్‍ కట్టుకుని ఇంట్లో పెట్టుకుంటారా.?  ఒకేసారి 3,500 ఇండ్లకు శాంక్షన్‍ ప్రొసీడింగ్స్ ఇస్తామంటే కుదరదు. లబ్ధిదారుల ఎంపికలో 60 ఏండ్ల పరిమితి ఉందని ఎవరూ చెప్పారు. 24 గంటల్లో పెండింగ్‍ ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. మిగతా వాటికి  జూన్‍ 6న డెడ్‍లైన్‍. ఈలోపు అన్ని క్లియర్‍ చేయాలే. ప్రభుత్వ పథకాల అమల్లో ప్రజలే ముఖ్యం.. పనితీరులో ఉద్యోగుల ముఖం చూడం” అంటూ వరంగల్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 

గురువారం మంత్రి హనుమకొండ కలెక్టరేట్‍లో  ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వరంగల్‍ ఎయిర్‍పోర్ట్ అంశాలపై జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, విప్‍ రామచంద్రునాయక్‍, మేయర్‍ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కేఆర్‍.నాగరాజు, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, యశస్విని రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కుడా చైర్మన్‍ వెంకట్రామిరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఒక్కో పథకం అమలు తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, నకిలీ విత్తన, ఎరువుల కట్టడి అంశాలపై చర్చించేటప్పుడు కలెక్టర్లు, అధికారులు, పోలీసుల తీరును తప్పుపట్టారు. ధాన్యం సేకరణ చర్చ సమయంలో భూపాలపల్లి, నర్సంపేట ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రాంత సెంటర్లకు డీసీఓలు, డీఆర్‍డీఏ అధికారులు ట్రక్‍ షీట్లు పంపించడంలేదని ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి స్థానిక అధికారులపై మండిపడ్డారు.  

పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేదు..? మంత్రి అసహనం

నకిలీ సీడ్స్ దందా నిందితులను మట్వాడా పోలీసులు మార్చి 22న అరెస్ట్ చేసినట్లు గ్రేటర్‍ పోలీస్‍ కమిషనరేట్‍ డీసీపీ షేక్‍ సలీమా చెప్పగా..  వారిపై పీడీ యాక్ట్ పెట్టారా..? అంటూ మంత్రి ప్రశ్నించారు. దీనికి డీసీపీ బదులిస్తూ .. ఇంకా పెట్టలేదని చెప్పడంపై  మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువుల అమ్మకాల దందాపై సర్కార్ కఠినంగా ఉండాలని చెబితే కూడా సీరియస్‍ నెస్‍ లేకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. నిందితులపై వెంటనే పీడీ యాక్ట్ పెట్టాలని ఆదేశించారు. ఏండ్ల తరబడి ఇండ్లులేక ఇబ్బందులు పడ్తున్నవారికి ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు.