
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బనకచర్ల ఇష్యూ, రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ శాసనసభ స్పీకర్కి లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విదేశాలకు వెళ్లడంతో ఈ విషయం కేటీఆర్కి తెలియకపోవచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే దేవాలయం లాంటి అసెంబ్లీలో చర్చ జరగాలి.
అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సవాల్ చేయాల్సిన కేటీఆర్ ప్రెస్ క్లబ్లో చర్చ చేద్దాం అంటున్నారు. ప్రెస్ క్లబ్లో చర్చ చేయడం సరైన విధానం కాదు. తెలంగాణ ప్రజానీకానికి తెలియాలంటే అసెంబ్లీలోనే చర్చ జరగాలి. చర్చకు మేము సిద్ధమని స్పష్టం చేశారు. కేటీఆర్కు సవాల్ విసురుతున్నా.. చర్చ బషీర్ బాగ్లో కాదు శాసన సభలో చేద్దాం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయండని కేసీఆర్తో లేఖ రాయించండి. కేసీఆర్ను అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనమని చెప్పండన్నారు. మేము చర్చకు బయపడే వాళ్లం కాదన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట సవాళ్లు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Also Read :చర్చకు మేం సిద్ధం.. కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మనండి
బనకచర్లకు పునాది వేసింది బీఆర్ఎస్.. బేసిన్లు, భేషజాలు లేవని ఏపీకి నీటిని కట్టబెట్టింది ఆ పార్టీనేనని ఆరోపించారు. గతంలో ఏపీ మాజీ సీఎం జగన్తో నీటి ఒప్పందాలు చేసుకుంది ఎవరని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు, బనకచర్లపై అప్పుడు మౌనంగా ఉన్నది ఎవరని నిలదీశారు. తెలంగాణకు అన్యాయం చేసింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనేనని విమర్శించారు.