ప్రజావాణికి 5 వేల అప్లికేషన్లు ..అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం

ప్రజావాణికి 5 వేల అప్లికేషన్లు ..అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం
  • జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన జనం
  • అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం
  • ప్రజా భవన్​లో అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్​
  • ధరణి, అగ్రిగోల్డ్, భూ సేకరణ, స్పౌజ్ బదిలీలపై వినతులు​

బేగంపేట, వెలుగు: ప్రజావాణికి జనం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి మంగళవారం ఉదయమే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు.. వారి సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజా భవన్​లో క్యూ కట్టారు. భూ సమస్యలు, స్పౌజ్ ​బదిలీలు, అగ్రిగోల్డ్​ బాధితులు ప్రభుత్వానికి వారి సమస్యలు చెప్పుకున్నారు. మంగళవారం ఒక్క రోజే వివిధ సమస్యల పరిష్కారం కోసం 5,126 ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, స్టేట్​నోడల్​అధికారి దాసరి హరి చందన ప్రజావాణికి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొదట దివ్యాంగుల నుంచి ఫిర్యాదులను తీసుకున్న అనంతరం మెయిన్ బిల్డింగ్​లో అర్జీదారుల సమస్యలు విన్నారు. 

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి బాధితులకు డబ్బు చెల్లించాలని కోరుతూ తెలంగాణ అగ్రిగోల్డ్​ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎన్​.బాల మల్లేశ్​​ ఆధ్వర్యంలోని బాధితులు ప్రజావాణిలో కోరారు. శంషాబాద్​ మండలం బోసెట్టి గూడ గ్రామంలో ధరణికి సంబంధించిన భూసమస్యపై పలువురు మంత్రికి విన్నవించారు.  కొండ పోచమ్మసాగర్ నుంచి సంగారెడ్డి మెయిన్​కాలువ రిచ్​–2 భూసేకరణలో తమ విలువైన భూములు పోతున్నాయని, పనులు నిలిపివేయాలని కోరుతూ మెదక్ ​జిల్లా చిన్న చింతకుంటకు చెందిన రైతులు పాదయాత్రతో ప్రజావాణికి చేరుకొని ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చారు. తెలంగాణలోని13 జిల్లాల్లో స్పౌజ్​బదిలీలు చేపట్టాలంటూ.. రాష్ట్ర స్పౌజ్​ ఫోరం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై వినతి పత్రం ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో తమకు నష్టం జరుగుతోందని పలువురు ఆటో డ్రైవర్లు మంత్రికి అర్జీ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన అన్ని సమస్యలపై పనిచేస్తున్నామని చెప్పారు. ఆటో డ్రైవర్లు ఆందోళన చేందవద్దని తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

సీఎం ఫొటోకు పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ వార్డు సభ్యుల సంఘం అధ్యక్షుడు కిన్నెర యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఫొటోకు పాలాభిషేకం చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వార్డు సభ్యులకు అధికారాలు, మాజీ వార్డు సభ్యులకు పింఛన్​ఇవ్వాలని కోరుతూ.. సీఎం రేవంత్​రెడ్డి ఫొటోకు పాలాభిషేకం చేశారు. కాగా వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు దూరప్రాంతాల నుంచి  వచ్చిన వారి కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజాభవన్​ఆవరణలో తాగునీరు, మెడికల్​సౌకర్యం, ఫిర్యాదుదారులకు అవసరమైన కాగితాలు సమకూర్చారు. జీహెచ్​ఎంసీ కమిషనర్​రోనాల్డ్​రోస్​సౌకర్యాలను పర్యవేక్షించారు.