
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా వరి, మొక్కజొన్న, ఆయిల్ పాం ఇతర పంటలు వేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్లలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మాందాటి వెంకట్రెడ్డి అనే రైతు పొలం దున్ని, రైతులతో కలిసి విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా మంత్రి రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
రైతులు ఎక్కడ ఖాళీ జాగా లేకుండా చూడాలన్నారు. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు వారి పరిధిలో ఏదో ఒక విత్తనం వేసే విధంగా చూడాలన్నారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర అందిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు తన క్యాంపు ఆఫీస్ను సంప్రదించాలని, తానే స్వయంగా విత్తనాలు అందిస్తానన్నారు. రైతాంగానికి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు హుస్నాబాద్ లో మూడు రోజులు రైతు మహోత్సవం నిర్వహించినట్లు తెలిపారు.
ఎల్లమ్మ ఆలయంలో పూజలు...
హుస్నాబాద్లో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీసమేతంగా పూజలు చేశారు. వారికి అర్చకులు, నిర్వాహకులు స్వాగతం పలికారు. అమ్మవారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి వెండి తొడుగులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నెల రోజులపాటు కొనసాగిన ఎల్లమ్మ జాతర బుధవారంతో ముగిసింది.
ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించాలి..
ఇందిరమ్మ లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కోహెడ మండలం బస్వాపూర్ లో మంత్రి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగడి బజార్ లో కూరగాయలు అమ్మే వ్యాపారులతో, స్థానిక టీ కొట్టులో చాయ్ తాగుతూ ప్రజలతో ముచ్చటించారు. అంతకుముందు ఏప్రిల్27న నంగునూర్ మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద బీఆర్ఎస్సభకు వెళ్లి వస్తున్న వాహనం ఢీకొట్టడంతో బస్వాపూర్కు చెందిన తాడేం సారయ్య, బండోజు గణేశ్ మృతి చెందారు.
బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి అందజేశారు. వారి పిల్లల చదువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో లైబ్రరీ చైర్మన్లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివ్వయ్య, ఏఎంసీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.