ఖమ్మం : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఓ చిన్నారికి రూ.50 వేలు సాయం అందించారు. ఖమ్మంలోని 18వ డివిజన్, మెదర బజార్ కు చెందిన 10 ఏళ్ల చిన్నారి మరసకట్ల అరణ్య శ్రీ కొన్ని రోజులుగా బ్రెయిన్ ట్యూమతో తీవ్ర బాధ పడుతుంది. అయితే చిన్నారి తల్లిదండ్రులు సాయం కోసం మంత్రి పువ్వాడను కలిశారు. దిక్కుతోచని స్థితిలో శనివారం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని కలిసి తన గోడు విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి.. అపరేషన్ చేసి బ్రెయిన్ లోని గడ్డను తొలగించాలని చెన్నై హాస్పిటల్ డాక్టర్లకు సూచించారు.
అరణ్యశ్రీ వివరాలు అడిగి తెలుసుకుని చిన్నారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదివారం తన నివాసంలో చిన్నారి అరణ్య శ్రీ తల్లిదండ్రులు వీరా కుమార్, శైలజ లకు రూ.50,000 నగదును అందజేశారు. వీరా కుమార్ నగరంలో పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంత్రి పువ్వాడ సహకారంతో వారి కళ్ళలో ఆనందం వెల్లువిరిసింది. అడిగిన వెంటనే స్పందించినందుకు చిన్నారి తల్లిదండ్రులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.