హైదరాబాద్, వెలుగు: మన దేశంలో ప్రముఖ సంస్థ టెస్లా పెట్టుబడులు పెడుతుందన్న కథనాలతో వివిధ రాష్ట్రాలు ఆ సంస్థ కోసం ప్రయత్నాలను ప్రారంభించాయి. తెలంగాణ కూడా టెస్లాను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉందన్న విషయాన్ని టెస్లా కంపెనీ ప్రతినిధులకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నది.
ఆ సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇదివరకే ప్రకటించారు. అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాజాగా, త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో పెట్టుబడులపై చర్చించేందుకు ఇండియాకు వస్తున్నానని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించడంతో మంత్రి శ్రీధర్ బాబు మరోసారి స్పందించారు. ఎలన్ మస్క్ను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ గురువారం ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఇండియాలో అత్యంత యంగ్ స్టేట్ అయిన తెలంగాణ మిమ్మల్ని ఇండియాకు సాదరంగా ఆహ్వానిస్తున్నది’’ అని పేర్కొన్నారు.
