మాంసం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ధరల నియంత్రణకు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లాక్ డౌన్ క్రమంలో రాష్ట్రంలో మాంసం, చికెన్, చేపల లభ్యతపై మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి. పశుసంవర్ధక శాఖ , మత్స్య శాఖ, పోలీసు, రవాణా శాఖ అధికారులతో జిల్లా స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా జిల్లాల నుండి గొర్రెలు, మేకల సరఫరా నిలిచిన కారణంగానే మటన్ ధరలు పెరిగాయన్నారు. మాంసం విక్రయించే దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి , అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
కూరగాయలు, పాలు, పండ్లు, కోళ్ళు, గ్రుడ్లు తదితర నిత్యావసర వస్తువుల సరఫరాకు ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని.. గొర్రెలు, మేకలు పెంపకం దారులు తమ జీవాలను ఆయా జిల్లాలలో, జంట నగరాలకు తీసుకొచ్చి విక్రయించుకునే విధంగా అనుమతుల కోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. మత్స్యకారులు చేపలను రవాణా చేసుకొనేందుకు, విక్రయించు కునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
హైదరాబాద్ నుండి జిల్లాల కు వెళ్ళి చేపలు తీసుకొచ్చే వాహనాలకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సైజుకు వచ్చిన చేపలను పట్టుకొని విక్రయించు కునేలా మత్స్యకారులకు అనుమతులు ఇస్తామన్నారు. రవాణా చేసే వస్తువులను తెలిపేలా వాహనాలకు తప్పని సరిగా పోస్టర్లను ఏర్పాటు చేయాలని.. గోశాలలకు అవసరమైన గ్రాసం సరఫరా, జీవాలకు వైద్యం అందించడం తదితర అంశాలపై తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చికెన్ దుకాణాలలోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తరలించేలా GHMC అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు మంత్రి తలసాని.