
పద్మారావునగర్/సికింద్రాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో మాయమాటలతో వచ్చే కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను నమ్మి మోసపోవద్దని సనత్ నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం బన్సీలాల్పేట డివిజన్లోని భోలక్పూర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ మేకలమండి ప్రభుత్వ పాఠశాల వరకు ప్రచారం కొనసాగించారు. అమీర్పేటలోని అతిథి హోటల్లో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా మిలాప్లో మంత్రి తలసాని పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేసిన మంత్రికి మద్దతు ప్రకటిస్తున్నట్లు సిక్కు సమాజ్ ప్రతినిధులు తెలిపారు.