
- నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు : చెట్లను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో గాలిని కూడా కొనాల్సి వస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజాలో 16వ గ్రాండ్ నర్సరీమేళా పేరుతో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా హార్టీకల్చర్ షోను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. " చెట్లు పెంచనందుకు ఢిల్లీలో ఆక్సీజన్ కేంద్రాల అవసరం నెలకొంది. రాష్ట్రంలోనూ చెట్లు పెట్టకుంటే మంచినీళ్లతోపాటు గాలి కూడా కొనుక్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రూఫ్ గార్డెన్, వర్టికల్ గార్డెన్స్పేరిట ఇంటినిండా మొక్కలు పెంచేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు పెంచడం అనివార్యం. హార్టీకల్చర్ డైరెక్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున రూఫ్ గార్డెన్స్ ప్రోత్సహిస్తున్నారు. వీరిని వ్యవసాయశాఖ సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నది.
ప్రజలు ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా కూరగాయలతో పాటు పచ్చదనంగా ఉండేలా మొక్కలు పెంచాలి. ఇష్టదైవం, తల్లిదండ్రులు, పిల్లల పేరుతో ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలి. వృక్ష సంపదను పెంచుకుంటే తప్ప సమసమాజం సంతోషంగా ఉండే అవకాశాలు లేవు. మొక్కల పెంపకం జరగాలనే రాష్ట్రంలో వనమహోత్సవం నిర్వహిస్తున్నాం. నర్సరీ మేళాలో రూ.50 నుంచి రూ.3లక్షల ఖరీదైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి"
అని తుమ్మల పేర్కొన్నారు. హార్టీకల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మీన్ బాషా మాట్లాడుతూ..ఈ నర్సరీ మేళాలో కిచెన్ గార్డెన్, ఆర్ణమెంటల్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్, చెట్లను పెంచడానికి కావాల్సిన మెటీరియల్ను ప్రమోట్ చేసే విధంగా ఎగ్జిబిట్ చేయడం జరిగిందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎగ్జిబిట్స్ వచ్చాయని వివరించారు.కార్యక్రమంలో మేళా ఇన్ చార్జీ ఖాలీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.