
- జులై నాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలి
- వచ్చే మూడున్నరేళ్లలో అర్హులైన పేదలందరికీఇందిరమ్మ ఇళ్లు
కరీంనగర్, వెలుగు: ప్రతి ఒక్కరి సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా చూడాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో అమలుచేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలోని అస్తవ్యస్త పరిస్థితులను సరిచేస్తూ వెసులుబాటు చేసుకొని పాలన సాగిస్తున్నామని అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ, విద్యా, హౌసింగ్, పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సమావేశానికి బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిధిలో వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతు భరోసా, ఆయిల్ పామ్ సాగు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్ అయిన ఇండ్లు, ప్రభుత్వ స్కూళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, బడి బాట, మధ్యాహ్న భోజనం, తదితర అంశాలపై సంబంధిత కలెక్టర్లు మంత్రులకు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంగా గత పాలకుల హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. జులై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల స్టాక్ జిల్లాలో అందుబాటులో పెట్టుకోవాలని, యూరియా వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తక్కువ సరఫరా చేస్తుందని వెల్లడించారు. అవసరమైన మేరకే యూరియా వాడాలని, అధికంగా వాడితే భూసారం తగ్గిపోతుందని హెచ్చరించారు. ఆయిల్పామ్ పంట చేతికి వచ్చిన రైతుల అనుభవాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగు విస్తరణ చేయాలన్నారు.
విద్యాశాఖపై కలెక్టర్లు శ్రద్ధ వహించాలని, ప్రైవేటు స్కూళ్ల కంటే మెరుగ్గా మన ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు విద్య అందాలని, ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు పెంచాలని ఆదేశించారు. జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖ, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించాలని, ఎక్కడైనా శిథిలావస్థలో స్కూళ్లు ఉంటే వెంటనే అక్కడి నుంచి తరలించాలని, వర్షాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించవద్దని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రివ్యూలకు జిల్లా అధికారులను మాత్రమే ఆహ్వానించాలని, కింది స్థాయిలో ఫీల్డ్ అధికారులను డిస్టర్బ్ చేయవద్దని సూచించారు.
ఎన్ రోల్మెంట్ పెరగడం అభినందనీయం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ వచ్చే మూడున్నరేళ్లలో శాచురేషన్ పద్ధతిలో పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న నిరుపేదల జాబితాను కలెక్టర్లకు అందిస్తే ఇందిరమ్మ కమిటీలో ద్వారా స్క్రూట్నీ చేయించి, నిరుపేదలైతే పార్టీలకతీతంగా తప్పనిసరిగా మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కల్తీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
ప్రభుత్వ స్కూళ్లలో ఎన్రోల్మెంట్ పెంచేందుకు కృషి చేస్తున్న టీచర్లకు, విద్యాశాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు. క్వాలిటీ ఒక్కరోజులో రాదని, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. కరీంనగర్లో ఉన్న జ్యోతి బాపూలే గురుకుల స్కూల్ను డీఈవో సందర్శించి అక్కడ పరిస్థితులపై కలెక్టర్కు నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు.
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆయిల్పామ్ రైతుగా తన అనుభవాలను చెప్పారు. కరీంనగర్లో పెండింగ్లో ఉన్న మానేరు రివర్ ఫ్రంట్, రోడ్లను పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.62 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎరువుల కొరత ఎక్కడా లేదని, ప్రతి మండలం వద్ద అవసరమైన స్టాక్ అందుబాటులో పెడ్తున్నామని అన్నారు. వేములవాడలో సూరమ్మ ప్రాజెక్టు, శ్రీపాద నారాయణపురం ప్రాజెక్టు అవసరమైన భూసేకరణ చేసేందుకు నిధులు విడుదల చేయాలని అన్నారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం, చింతకుంట విజయరమణారావు, ఎంఎస్ రాజ్ ఠాకూర్, డాక్టర్ సంజయ్కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ వివిధ అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్తు మల్లేషం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా, సత్యప్రసాద్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, నాలుగు జిల్లాల వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఒక్క గుంట కూడా బీడు కావొద్దు
బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు పూర్తిస్థాయిలో కాకపోయినా తమకు ఉన్న పొలంలో కొంతమేర వరి నుంచి ఆయిల్ పామ్ వంటి పంటలకు మళ్లాలని సూచించారు. వరి బంద్ చేయమని చెప్పొద్దని, అలా చెప్పి కేసీఆర్ ఏమాయ్యాడో చూశామని గుర్తు చేశారు. ముందుగా పెద్ద రైతులను గుర్తించి ఆయిల్ పామ్సాగుకు ప్రోత్సహించాలని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఒక్క గుంట భూమి కూడా బీడుగా ఉండొద్దన్నారు.
ఊరుకు ప్రైవేట్ స్కూల్ బస్సులు రాకుండా అడ్డుకుని, ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపే గ్రామంలో ఐదు ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని, హుస్నాబాద్ నియోజకవర్గంలో తాను హామీ ఇచ్చానని, ఇలాంటి ప్రయత్నాలు అంతటా జరగాలన్నారు. అలాగే వాడకంలో లేని కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై ఎంక్వైరీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.