ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలి : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ్రావు

ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలి : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ్రావు

కామారెడ్డి, వెలుగు : ఆయిల్​ పామ్ సాగుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు రైతులకు సూచించారు.  శుక్రవారం పాల్వంచ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్​ పామ్ మాస్​ ఫ్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని సబ్సిడీ పరికరాలను రైతులకు అందించారు. అనంతరం మండల కేంద్రంలోని ఫంక్షన్​ హాల్​లో నిర్వహించిన మీటింగ్​లో మంత్రి మాట్లాడారు.  అయిల్​ పామ్ సాగులో అంతర్​ పంటలను కూడా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.  

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలో  భాగంగా   ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తుందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న  పామాయిల్​ మిల్​ ద్వారా  ప్రభుత్వం నిర్ణయించిన ధరకు గెలలను కొనుగోలు చేసి  14 రోజుల్లోనే రైతుల అకౌంట్లలో నగదు జమ చేయనున్నారన్నారు.   కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  జాతీయ మిషన్​  వంట నూనెలు - ఆయిల్ పామ్  స్కీమ్​, మన రాష్ర్ట ప్రభుత్వం  కో ఆర్డినేషన్​తో  హార్టికల్చర్ శాఖ ద్వారా  కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుందన్నారు.  

జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ ( హెచ్​యూఎల్)కు బాధ్యతలు అప్పగించామని మంత్రి తెలిపారు.  రైతులు ఆర్థికంగా   బలపడేలా  కంపెనీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన నేలలు ఉన్నాయన్నారు.   రైతులు సంప్రదాయ పంటలతో పాటు  ఆయిల్ పామ్ సాగు చేయటం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు.  కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్​ బాషా,  అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్ పాల్గొన్నారు.  

మంత్రి తుమ్మలతో షబ్బీర్​అలీ భేటీ 

కామారెడ్డి జిల్లాలో ఆయిల్​ పామ్ తోటల ప్లాంటేషన్​కు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావుతో శుక్రవారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ భేటీ అయ్యారు.   నియోజకవర్గంలోని రైతాంగ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నియోజక వర్గంలో మరో 2 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు.  సాగు నీటి సమస్య పరిష్కారం కోసం పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం,    ఎరువుల లభ్యత, విత్తనాలు, కోల్డ్​ స్టోరేజీల నిర్మాణం తదితర అంశాలను మంత్రికి   వివరించారు. పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.

మంత్రిని కలిసిన  మున్సిపల్ చైర్​పర్సన్​

కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావును కామారెడ్డి  మున్సిపల్​ చైర్​పర్సన్​  ఇప్ప ఉమారాణి కలిసి సన్మానించారు.