ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరిస్తాం : మంత్రి ఉత్తమ్

ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరిస్తాం : మంత్రి ఉత్తమ్
  •     ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ 

హుజూర్ నగర్/ మేళ్లచెరువు , వెలుగు : ఎత్తిపోతల పథకాలు పునరుద్ధరిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.  ఆదివారం హైదరాబాద్‌‌లోని సెక్రటేరియట్‌‌లో కోదాడ , హుజూర్ నగర్  నియోజకవర్గాల  అభివృద్ధిపై ఇరిగేషన్ , ఆర్అండ్ బీ, పంచాయితీ రాజ్ శాఖ అధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నియోజకవర్గాల్లోని లిఫ్టులను పునరుద్ధరించి సాగునీరు అందిస్తామన్నారు. ప్రతి మూడు మైనర్ లిప్టు రిపేర్లు , పర్యవేక్షణకు ఒక జేఈ స్థాయి అధికారిని నియమించాలని, లిఫ్టుల ఆపరేటర్లుగా ఇరిగేషన్  ఉద్యోగులను నియమించాలని, అవసరమైన చోట కొత్త లిఫ్టులకు ప్రపోజల్స్‌‌ తయారు చేయాలని ఆదేశించారు.

గతంలో లిఫ్టుల నిర్వహణ పేరుతో జరిగిన అవినీతిపై  కేసులు నమోదు చేయాలన్నారు.  చెరువులు, కాలువల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని, నేరెడుచెర్లలో కబ్జా అయిన స్థలాన్ని రికవరీ చేయాలన్నారు.  ఆర్అండ్‌‌బీ, పంచాయితీ రాజ్ శాఖలో జరిగిన అవినీతిపై తనకు వివరాలు ఇవ్వాల, ఏసీబీ, విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసి విచారణ జరిపిస్తానన్నారు. ఆర్అండ్‌‌బీ గెస్ట్ హౌస్ బిల్డింగ్ నిర్మాణం, సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు.  

జాన్ పహాడ్ దర్గా దగ్గర  మౌలిక వసతులు కల్పించాలని  వక్ఫ్ బోర్డ్ అదికారులను  ఆదేశించారు.   ఈ సమావేశంలో ఆర్అండ్‌‌బీ ఎస్‌‌సీ రాజేశ్వర్ రెడ్డి, ఈఈ యాకోబ్, డీఈ పవన్ కుమార్ , ఏఈ శివ కుమార్ , ఇరిగేషన్  ఈఎన్‌‌సీ మురలీధర్ రావు, చీప్ ఇంజనీర్ రమేశ్ బాబు , ఎస్‌‌సీ నర్సింహారావు , ఈఈ శ్రీని వాస్ , డీఈలు స్వామి, భిక్షం ,లీడర్లు సాముల శివారెడ్డి , దొంగరి వెంకటేశ్వర్లు , గెల్లి రవి , తన్నీరు మల్లిఖార్జున,గుడెపు శ్రీనివాస్  పాల్గొన్నారు .