- మైనారిటీ సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నం
- నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు
- జూబ్లీహిల్స్లోని యూసుఫ్గూడలో మైనారిటీలతో సమావేశం
జూబ్లీహిల్స్, వెలుగు: దేశంలో సెక్యులరిజాన్ని పరిరక్షించేది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించే శక్తి కూడా ఒక్క కాంగ్రెస్కు మాత్రమే ఉన్నదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరుఫున యూసుఫ్గూడలో మైనారిటీల సమావేశం నిర్వహించారు. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్తో కలిసి ఉత్తమ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీ సంస్థలను, హక్కులను రక్షించడంలో విఫలమైందని అన్నారు. పదేండ్లలో 80 శాతం మైనారిటీ కాలేజీలు మూతపడ్డాయని, మైనారిటీ పురుషుల కోసం ప్రకటించిన సంక్షేమ పథకాలు అసపూర్ణంగా మిగిలాయని ఆయన గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4వేల కోట్ల మైనారిటీ డిక్లరేషన్, మైనారిటీ సబ్-ప్లాన్ ప్రకటించిందని, తొలి రెండేండ్లకు రూ.వెయ్యి కోట్ల సబ్సిడీ కేటాయించిందని, అమలు ప్రక్రియ మొదలైందని చెప్పారు.
గత 22 నెలల్లో మైనారిటీ కాలేజీలకు 2,200 అదనపు ఇంజినీరింగ్ సీట్లు, ఒక లా కాలేజీ, ఒక ఫార్మసీ కాలేజీ మంజూరు చేశామని, 2004-–14 వరకు కాంగ్రెస్ పాలనలో 6 మెడికల్ కాలేజీలు మైనారిటీలకు కేటాయించామని తెలిపారు. “విద్య ద్వారానే సాధికారత సాధ్యం.. అందుకే సంక్షేమాన్ని అవకాశాలతో అనుసంధానం చేశాం” అని చెప్పారు.
మైనారిటీలకు బీజేపీ, బీఆర్ఎస్మోసం
కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్.. ఈ రెండు పార్టీలు పదేండ్లలో మైనారిటీ సంస్థలకు నిధులను తగ్గించి, వెల్ఫేర్ వ్యవస్థలను దెబ్బతీశాయని ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మైనారిటీల స్కాలర్షిప్లు, వృత్తి నైపుణ్య పథకాలు, విద్యా గ్రాంట్లు తగ్గించిందని విమర్శించారు. తమను తాము సెక్యులర్గా చూపించుకునే బీఆర్ఎస్.. మైనార్టీలకు అందాల్సిన వాటాపై ఒక్క మాట మాట్లాడలేదని, కేవలం రాజకీయాలే లక్ష్యంగా ముందుకు పోతున్నారని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటివరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపనలు చేశారని, వాటన్నింటినీ పూర్తిచేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మైనారిటీలందరూ అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
