బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పదేళ్లలో ఏపీ అక్రమంగా 1200టీఎంసీలు తరలించుకుపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా.. రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కు ఆనాడు జగన్ కు సహకరించింది కేసీఆరేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ఆపించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుదన్నారు ఉత్తమ్.
కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకాలు చేసి తెలంగాణకు మరణ శాసనం రాశారని ఫైర్ అయ్యారు ఉత్తమ్. కృష్ణానదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పదేళ్లలో ఏపీ రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రోజుకు 3టీఎంసీలు వాడుకుంటుంటే బీఆర్ ఎస్ ప్రభుత్వం సైలెంట్ గా ఉందని తెలిపారు ఉత్తమ్. కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు కేటాయించిన వాటాను బీఆర్ఎస్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని చెప్పారు. కృష్ణా జలాల వినియోగంలో రైతులు ఎక్కువగా వినియోగించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనేనని తెలిపారు.
పదేళ్లలో ఇరిగేషన్ పై లక్షా 83 వేల కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ సర్కార్ ఒక్క ఎకరాకు నీళ్లియ్యలేదని విమర్శించారు. రూ.7469 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే..కల్వకుర్తి, భీమా,కోయిల్ సాగర్ పూర్తయ్యేవి వీటి వల్ల 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవని చెప్పారు. కాళేశ్వరంపై ఉన్న శ్రద్ద బీఆర్ఎస్ కు పాలమూరుపై లేదన్నారు. 2018లో పాలమూరును పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరానికి త్వరగా అప్రూవల్ క్లియరెన్స్ తెచ్చుకున్నారు కానీ.. పాలమూరుకు ఎలాంటి క్లియరెన్స్, అప్రూవల్ తీసుకురాలేదన్నారు. పాలమూరుకు డీపీఆర్ తయారు చేసి సీడబ్లూసీకి ఇచ్చే వరకు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరులో 30 శాతం పనులు మాత్రమే అయ్యాయని చెప్పారు. ఈ రోజు పాలమూరు అంచనా వ్యయం 80 వేల కోట్లకు చేరిందన్నారు.పాలమూరుకు తీరని అన్యాయం చేసింది కేసీఆరేనని ధ్వజమెత్తారు ఉత్తమ్.
కృష్ణా జలాల్లో 71పర్సంటేజ్ కావాలని బ్రిజేష్ ట్రిబ్యునల్ లో వాదిస్తున్నామని చెప్పారు ఉత్తమ్. మొదటి సారిగా ఫిబ్రవరి 2024లో కృష్ణానీళ్లలో తెలంగాణకు 71 పర్సంటేజ్ ఇవ్వాలనిక్రిష్ణా ట్రిబ్యునల్ ముందు వాదించామన్నారు. ఇరిగేషన్ అప్పులకు వడ్డీలు 16 వేల కోట్లు కడుతున్నామని చెప్పారు ఉత్తమ్.
