బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ఇవాళ ఉదయం మంత్రి వాకిటీ శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నికత్ జరీన్ ను అభినందించి, శాలువాతో సన్మానించారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇటీవల గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్ 2025 లో గోల్డ్ మెడల్ సాధించినందుకు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించి దేశ,రాష్ట్ర ప్రతిష్టతను మరింత పెంచాలని కోరారు .
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడాశాఖ మంత్రిగా క్రీడా ప్రోత్సాహక,విధానాలతో తెలంగాణ క్రీడాకారులు ప్రపంచ వేదికలపై అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసానిస్తుందన్నారు.
గోల్డ్ మెడల్
తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అదిరిపోయే ప్రదర్శనతో గోల్డ్ మెడల్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చాటిన నిఖత్.. ఫైనల్ బౌట్ మొత్తంలో ధైర్యం, దూకుడు, నైపుణ్యం అద్భుతంగా ప్రదర్శించి మువ్వన్నెల జెండాను మరోమారు ప్రపంచ వేదికపై ఎగురవేసింది. టోర్నమెంట్ మొత్తంలో అజేయంగా సాగిన నిఖత్, తెలంగాణకు, భారత బాక్సింగ్కు కొత్త గౌరవాన్ని తెచ్చింది. విజయం అనంతరం దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిఖత్ సాధించిన ఈ గోల్డ్ మెడల్ భారత మహిళా బాక్సింగ్లో మరో మైలురాయిగా నిలిచింది.
