- బండి సంజయ్..సవాల్కు సిద్ధమా?
- ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ముందుంది
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని జాబ్స్ఇచ్చారు?
- ఎంపీ అర్వింద్పై రైతులు అందుకే తిరగబడుతున్నరు
- ఆర్అండ్బీ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్, వెలుగు : రాష్ట్రంలో లక్ష 32వేల ఉద్యోగాలు ఇచ్చామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆర్అండ్ బి మినిష్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసిరారు. సోమవారం బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఉద్యోగాల కోసం మిలియన్ మార్చ్ చేస్తానన్న బండి సంజయ్ ఆ మార్చ్ ముందు మోడీ దగ్గర చేయాలన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఉద్యోగాల కల్పనపై వైట్పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్చేశారు. మంత్రి కేటీఆర్ చొరవతో ప్రైవేట్ రంగంలో 16 లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రైవేటు రంగంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చూపించాలన్నారు. దీనిపై కూడా చర్చకు రావాలన్నారు. బాల్కొండ డెవలప్మెంట్పై విమర్శించేవారంతా రాజకీయంగా అడ్రస్ లేనివారేనన్నారు. నియోజకవర్గ ప్రజలు, రైతులు అన్నీ గమనిస్తున్నారని, సరైన టైంలో వారే సమాధానం చెబుతారన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పసుపుబోర్డు పేరుతో రైతులను మోసం చేశాడని, మద్దతు ధర ఇప్పిస్తానని మూడేండ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడని, అందుకే రైతులు తిరగబడుతున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాభివృద్ధికి అడ్డం పడుతుందని, ఆ పార్టీని తెలంగాణ పాలిట శత్రువుగానే పరిగణిస్తామన్నారు.