
కష్టాలు పడతున్నానని పోస్ట్
అధికారులతో మాట్లాడిన మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్ ,వెలుగు: కువైట్ లో కష్టాలు పడుతున్నానంటూ మానేటి మనోజ్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ పెట్టగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్ కు చెందిన మనోజ్ గత ఏడాది డిసెంబర్ లో ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కంపెనీ వ్యక్తులు చెప్పిన పని కాకుండా వేరే పనులు చేయిస్తున్నారని, భోజనం కూడా పెట్టడం లేదని, తనను కువైట్ పంపించిన ఏజెంట్, కంపెనీ మోసం చేసిందని ట్వీట్ చేశాడు.
తనను ఇండియాకు తీసుకురావాలని ట్వీట్ లో పేర్కొన్నాడు. దీనిపై మంగళవారం స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..జీఏడీ సెక్షన్ అఫీసర్ (ఎన్ ఆర్ ఐ అఫైర్స్ ) చిట్టిబాబుతో ఫోన్ లో మాట్లాడారు. మనోజ్ ను ఇండియాకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కువైట్ లో ఉంటున్న ఎన్ఆర్ఐ మురళీధర్ రెడ్డి, కువైట్ తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ వినయ్ ముత్యాలకు వివరాలు పంపించారు. మనోజ్ ను స్వయంగా కలిసి అతడికి సాయం చేయాలని మంత్రి వారిని కోరారు.