
- ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వామ్యులు కావాలని పిలుపు
- సికింద్రాబాద్లో వాసవి ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్లో లక్ష బెలూన్లు గాల్లోకి
పద్మారావు నగర్/బషీర్బాగ్, వెలుగు: యువత మత్తు వీడాలని, ప్రతి రోజూ మైదానాలకు వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. డ్రగ్స్కు యూత్ దూరంగా ఉండాలని కోరారు. బుధవారం (అక్టోబర్ 02) సికింద్రాబాద్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ను జింఖానా గ్రౌండ్లో ఘనంగా నిర్వహించగా, మంత్రి వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు.
‘మత్తు వీడండి.. మైదానాలకు రండి..’అనే నినాదంతో వాసవి క్లబ్ మెంబర్స్తో కలిసి మంత్రి లక్ష బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. సే టు నో డ్రగ్స్.. నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వాసవి క్లబ్ మెంబర్స్ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, వాటి వల్ల జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే.. మరో పది మందికి సాయం చేస్తారన్నారు. ఒకరు చేసే మంచి పనిని ప్రచారం చేయడం వల్ల దానిని మరికొందరు స్ఫూర్తిగా తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలో చాలా మంది బిజినెస్ మెన్స్ ఛారిటీ చేస్తారని, ఛారిటీ చేసే వారు తమ రంగంలో గొప్పగా రాణిస్తారన్నారు. రూ.కోట్ల వ్యయంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న వాసవి క్లబ్ను మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా వాసవి క్లబ్ నిర్వాహకులు మంత్రిని కరెన్సీ మాల, శాలువాతో ఘనంగా సత్కరించి, మెమోంటో అందజేశారు. అనంతరం వంద మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాజకీయాలకతీతంగా వాసవి క్లబ్ పనిచేస్తున్నదని క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ చెప్పారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సీనియర్ నాయకులు గంప శ్రీనివాస్, యాద నాగేశ్వరరావు, ముక్తా శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ గవర్నర్ అశోక్ కుమార్, సూర్యప్రకాశ్, శ్రీనివాసులు, సూర్యప్రకాశ్, సుజాత రమేశ్ బాబుతో పాటు పెద్ద వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన వాసవి క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి వివేక్..
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ కోఠి ట్రూప్ బజార్లో ట్రూప్ బజార్ కల్చరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. దుర్గ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గత 18 ఏండ్లుగా ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారని.. ఏటా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు చెప్పారు. 10 రోజుల పాటు అన్నదానంతో పాటు మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న అసోసియేషన్ ప్రతినిధులు ఆవుల సుధీర్ బాలనందం, కిషన్, సురేఖ, సునీల్, సాబాబు, హరీశ్, దత్తు, అనిల్ను మంత్రి వివేక్ వెంకటస్వామి అభినందించారు.