- ప్రతిపక్షాలు, కేటీఆర్, హరీశ్రావు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు: మంత్రి వివేక్
- టెండర్ ప్రక్రియ చాలా పారదర్శకం జరిగింది
- కుటుంబసభ్యుల ఫోన్లనూ ట్యాప్ చేసినోళ్లు మాకు నీతులు చెప్తరా ?
- నా ఫోన్ను కూడా ట్యాప్ చేసిన్రు
- చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో రూ.2.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కోల్బెల్ట్/చెన్నూరు, వెలుగు: కోల్బ్లాక్ టెండర్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కేటీఆర్, హరీశ్ రావుతోపాటు ప్రతిపక్ష పార్టీలు కావాలనే ప్రభుత్వంపైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. టెండర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు మురళీ కృష్ణ, మారుతీప్రసాద్తో కలిసి.. చెన్నూరు మున్సిపాలిటీ ప్రారంభంలో స్వాగత తోరణం, కల్వర్టుల నిర్మాణం, పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రాజీవ్ చౌక్ వద్ద కూరగాయల మార్కెట్ షెడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. నైనీ బొగ్గు బ్లాక్ విషయంలో తమ జోక్యం లేదని సీఎం, డిప్యూటీ సీఎం ఇప్పటికే తేల్చి చెప్పారని, బీఆర్ఎస్ లీడర్లు ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. కొత్త కోల్ మైన్స్ వస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుందని, కోల్బెల్ట్ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. రామకృష్ణాపూర్లో ఓసీపీ రెండో ఫేజ్ మైన్ త్వరలోనే ప్రారంభం కానుందని, సింగరేణి థర్మల్పవర్ ప్లాంట్లో మూడో యూనిట్పనులకు ఫిబ్రవరిలో సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నట్టు ప్రకటించారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిండు..
రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, కాళేశ్వరం, మిషన్ భగీరథ పనుల పేరుతో కోట్ల రూపాయలు దండుకొని పేదలపై భారం మోపారని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని చెప్పారు. చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో వందల కోట్లు ఖర్చు చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. పదేండ్లు ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన బాల్క సుమన్.. చెన్నూరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. నిధులు లేకున్నా కేవలం ప్రొసీడింగ్స్ను చూపిస్తూ.. ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. కమీషన్ల కోస మే పెద్దపెద్ద పనులను చేపట్టాడని ఆరోపించారు. తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్న టైంలోనే క్యాత నపల్లి రైల్వే గేట్ వద్ద ఆర్వోబీని మంజూరు చేశారని, ఆ పనులను పదేండ్ల కాలంలో బాల్క సుమన్ పూర్తి చేయలేకపోయారన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాతే పనులు పూర్తి చేయించి ఆర్వోబీని ప్రారంభించడంతోపాటు లైటింగ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. మున్సిపల్ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని మంత్రి చెప్పారు.
ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్..
బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని.. చెల్లె కవిత, ఆమె భర్త అనిల్, బావ హరీశ్ రావుతో పాటు తండ్రి కేసీఆర్ ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారని మంత్రి వివేక్ ఆరోపించారు. ఫోన్ ట్యాప్ చేయాలంటే రూల్స్ ప్రకారం.. చీఫ్ సెక్రటరీ అనుమతి ఉండాలని, ఇందుకు భిన్నంగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లతో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని మండిపడ్డారు. ‘‘దీన్ని ఉపయోగించుకొని మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష లీడర్లపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేశారు. నా ఫోన్ను కూడా ట్యాప్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నానంటూ నా మీడియా సంస్థల గొంతు నొక్కేందుకు ప్రయత్నించారు’’ అని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న కేటీఆర్.. సుద్దపూసలా మాట్లాడుతున్నారని వివేక్ ఎద్దేవా చేశారు. సొంత కుటుంబసభ్యుల ఫోన్లనూ ట్యాప్ చేసినోళ్లు తమకు నీతులు చెప్తరా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ కల్పించిన మాట్లాడే హక్కు, భావ వ్యక్తీకరణ హక్కుకు భంగం కలిగించారని, ప్రజలను మభ్యపెట్టి డైవర్షన్ పాలిటిక్స్చేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి గట్టిగా బుద్ధి చెప్పారని, అయినా ఆ పార్టీ లీడర్లు తప్పులను సరిదిద్దుకోవడం లేదన్నారు.
