ఊపందుకున్నఆత్మీయ సమ్మేళనాలు

ఊపందుకున్నఆత్మీయ సమ్మేళనాలు
  •     అన్నివర్గాలను కలుస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
  •     అసంతృప్తులను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు 
  •     కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి హామీలు

మహబూబ్​నగర్, వెలుగు : ఎలక్షన్ల టైం దగ్గర పడుతుండటంతో ఆత్మీయ సమ్మేళనాలు ఊపందుకుంటున్నాయి. రెండు నెలల కింద ఒక ట్రిప్​ సమ్మేళనాలు కంప్లీట్​ చేసిన రూలింగ్​ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు..వారికి టికెట్లు కన్​ఫాం కావడంతో సెకండ్​ ఫేజ్​ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా వర్గాలకు కొత్త కొత్త హామీలు ఇస్తూ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

కుల సంఘాలపై ఫోకస్..

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 స్థానాల్లో బీఆర్ఎస్​ హైకమాండ్  గత మంగళవారం క్యాండిడేట్లను ఫైనల్​ చేసింది. సిట్టింగులకే చాన్స్​ రావడంతో, వారంతా ఇప్పుడు ప్రచారంపైనే ఫోకస్​ పెట్టారు. ఈ ఎలక్షన్​లో ప్రతి ఓటు కీలకం కావడంతో అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని కలుపుకుపోయే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ప్రతి వర్గానికి చెందిన ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఆత్మీయ సమ్మేళనాలకు ప్లాన్​ చేశారు. ప్రతి రోజూ ఏదో ఒక వర్గంతో ఇంటరాక్ట్​ అయ్యేటట్లు షెడ్యూల్​ పెట్టుకుంటున్నారు. వడ్డెరులు, యాదవులు, పద్మశాలీలు, ఆర్యవైశ్యులు, బ్రహ్మణ, నాయిబ్రాహ్మణులు, ముదిరాజ్​లు, బలిజ, గౌడ, మైనార్టీ తదితర వర్గాలను కలుస్తున్నారు. 

ఇందుకోసం సమ్మేళనాల్లో గ్రాండ్​గా ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మేళనాలకు ముందు ఆయా వర్గాలతో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పటాకులు కాల్చి ప్రత్యేక వాహనాల్లో సభకు వరకు ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు హాల్​లోకి ఎంట్రీ కాగానే గజమాలలతో సత్కారాలు, పెద్ద ఎత్తున పూల వర్షం కురిపిస్తున్నారు. అనంతరం ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్గాల కోసం చేసిన కృషిని వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమకే ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అనంతరం ఈ వర్గాలకు చెందిన పెద్ద మనుషులతో చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో తమకే సపోర్ట్​ చేయాలని హామీ తీసుకుంటున్నారు. 

తమను తిరిగి గెలిపిస్తే కమ్యూనిటీ హాళ్లు లేని చోట్ల కొత్త వాటి నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు. వెంటనే భూమి కేటాయింపు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని యుద్ధప్రాతిపదిన పూర్తి చేయించి, రిబ్బన్​ కట్​ చేస్తున్నారు. వీరితో పాటు వివిధ శాఖల ఉద్యోగులు, డీఆర్డీఏ, సెర్ప్, మెప్మా సిబ్బంది, రిటైర్డ్​ ఎంప్లాయిస్, కుల సంఘాల వారీగా ఉద్యోగులతో ములాఖత్​ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అంకితభావంతో పని చేస్తోందని, ఇచ్చిన హామీల ప్రకారం కాంట్రాక్ట్  ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేసిందని గుర్తు చేస్తున్నారు. కొన్ని డిపార్ట్​మెంట్లలో పని చేస్తున్న వారికి జీతాలు కూడా పెంచిన విషయాన్ని సమ్మేళనాల్లో ప్రస్తావిస్తున్నారు. తమను తిరిగి గెలిపిస్తే, ఫ్యూచర్​లో ఉద్యోగులకు మరింత మేలు జరిగేలా చూస్తామని హామీ ఇస్తున్నారు.

స్పెషల్ అట్రాక్షన్​గా 

ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రజలను అట్రాక్ట్​ చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కుటుంబసభ్యులతో కలిసి హాజరవుతున్నారు. భార్యలతో వచ్చి సర్​ప్రైజ్​ చేస్తున్నారు. వారితో మైక్ పట్టించి మాట్లాడిస్తున్నారు. భోజనాలు ప్రారంభమయ్యాక వీరే స్వయంగా డైనింగ్​ టేబుళ్ల వద్దకు వెళ్లి పబ్లిక్​కు దగ్గరుండి వడ్డిస్తున్నారు. ఒక్కొక్కరిని పలుకురిస్తున్నారు. పనిలో పనిగా వారి కుటుంబాల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు.