
- ఒక్కో ఖండం నుంచి ఒక్కరు ఎంపిక
- హైటెక్స్లో తుది పోటీలకు ఏర్పాట్లు
- హాజరుకానున్న సీఎం, మంత్రులు, ప్రముఖులు
హైదరాబాద్, వెలుగు: మిస్వరల్డ్ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 31న హైదరాబాద్లోనిహైటెక్స్లో గ్రాండ్ఫినాలే జరగనుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఫైనల్ పోటీలు జరగనున్నాయి. వీటికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, 109 దేశాలకు చెందిన మిస్వరల్డ్ కంటెస్టెంట్లు, వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే వాళ్లకు ఇన్విటేషన్స్ అందజేశారు. హైటెక్స్లో 3 వేల సీటింగ్ కెపాసిటీతో కొత్త హాల్నిర్మించగా, ఆ మేరకే గెస్టులను ఆహ్వానిస్తున్నారు.
మొత్తం 3వేల పాసుల్లో 1,500 మిస్వరల్డ్నిర్వాహకులకు అందజేయగా.. మరో 1,500 పాసులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఈవెంట్ను తిలకించేందుకు పరిమిత సంఖ్యలో మాత్రమే సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించగా, దాదాపు 10 వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. ఇందులో 500 నుంచి వెయ్యి మందిని ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ఫైనల్కు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక కమిటీ నేతృత్వంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఫైనల్ పోటీలను సోనీ టీవీ ద్వారా టెలికాస్ట్చేయనున్నారు. వీటిని దాదాపు 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో తెలంగాణ సంస్కృతి, పర్యాటక ప్రాంతాలపై విస్తృతంగా ప్రసారం చేసేలా ప్లాన్ చేశారు.
విజేతకు రూ.8.5 కోట్లు..
మిస్ వరల్డ్ విజేతకు భారీగా ప్రైజ్మనీ దక్కనుంది. రూ.8.5 కోట్లకు పైగా అందనుంది. అలాగే విజేతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. సెలబ్రిటీ హోదా దక్కడంతో పాటు ప్రముఖ బ్రాండ్ల ప్రచారకర్తగా, నటిగా అవకాశాలు లభిస్తాయి. మిస్ వరల్డ్ సంస్థ తరఫున వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే చాన్స్ దక్కుతుంది.
ఫైనల్ కంటెస్టెంట్ల వివరాలు గోప్యం..
మిస్ వరల్డ్ కాంటెస్ట్లో భాగంగా మొదట ప్రాథమిక పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత మూడు దశల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్ జరిగాయి. మొదటి దశలో ఒక్కో ఖండం నుంచి 10 మంది చొప్పున నాలుగు ఖండాల (అమెరికా-కరీబియన్స్, ఆఫ్రికా, ఐరోపా, ఏషియా-ఓషియానియా) నుంచి 40 మందిని ఎంపిక చేశారు.
రెండో దశలో ప్రతి ఖండం నుంచి ఎంపికైన 10 మందిలో ఐదుగురు చొప్పున ఎంపిక చేశారు. ఇక మూడో దశలో ప్రతి ఖండం నుంచి ఎంపికైన ఐదుగురిలో ఇద్దరిని ఎంపిక చేశారు. అంటే పోటీలో 8 మంది మిగిలారు. వీరికి సెమీ ఫైనల్ నిర్వహించి, ఒక్కో ఖండం నుంచి ఒక్కరిని ఫైనల్కు ఎంపిక చేశారు. అంటే ప్రతి ఖండం నుంచి ఒక్కరు చొప్పున నలుగురు ఫైనల్లో పోటీ పడనున్నారు. అయితే వీరి వివరాలు ఇంకా వెల్లడించలేదు. గురు లేదా శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఫైనల్ కోసం అందాల భామలు రిహార్సల్స్ మొదలుపెట్టారు. బుధవారం ప్రారంభమైన రిహార్సల్స్ శనివారం ఉదయం వరకు కొనసాగనున్నాయి.