(వెలుగు స్పోర్ట్స్ డెస్క్): టెస్టుల్లో 42 నెలల పాటు నంబర్ వన్ . ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు టెస్టు సిరీస్లు నెగ్గిన హిస్టరీ. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైమ్ టీ20 సిరీస్లు కైవసం..! హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ హయాంలో ఇండియా సాధించిన కీలక విజయాలు ఇవి. కోచ్గా శాస్త్రి పదవీకాలం ముగియగా.. టీ20 కెప్టెన్గా కోహ్లీ లాస్ట్ మ్యాచ్ ఆడేశాడు. దాంతో, ఇండియా క్రికెట్లో ఓ కీలక ఘట్టం ముగిసింది. ఈ టీ20 వరల్డ్కప్లో సెమీస్కు ముందే నాకౌట్ అవడం చేదు జ్ఞాపకమే అయినా..ఇద్దరూ కలిసి ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సాధించలేకపోయినా.. బైలేటర్ సిరీస్ల్లో చాలా సక్సెస్ సాధించారు. ముఖ్యంగా టెస్టుల్లో ఇండియాను తిరుగులేని శక్తిగా మార్చారు. ఇండియా క్రికెట్ హిస్టరీలో వీళ్లు ఎన్నో మధుర జ్ఞాపకాలను చేర్చారు. ఈ ఇద్దరి కాంబోను టీమిండియా కచ్చితంగా మిస్ అవుతుంది.
2014లో మొదలై..
కోహ్లీ–శాస్త్రి కాంబో 2014లో మొదలైంది. 2014లో ఆస్ట్రేలియా టూర్ మధ్యలో ధోనీ అనూహ్యంగా టెస్టుల నుంచి రిటైర్ అవ్వడంతో కెప్టెన్సీ అందుకున్న కోహ్లీ.. శాస్త్రితో జత కట్టాడు. అదే ఏడాది టీమిండియా డైరెక్టర్గా నియమితుడైన శాస్త్రి తర్వాత హెడ్ కోచ్ అయ్యాడు. 2016లో పదవి కోల్పోయినా 2017 జులైలో తిరిగొచ్చాడు. అప్పటి నుంచి శాస్త్రి–కోహ్లీ జోడీ ఇండియాకు సక్సెస్ఫుల్ కోచ్–కెప్టెన్ పెయిర్గా పేరు తెచ్చుకుంది. ఈ ఇద్దరి కాంబోలో ఇండియా 150 మ్యాచ్లు ఆడింది. ఈ క్రమంలో కోచ్, కెప్టెన్గానే కాకుండా ఇద్దరి మధ్య అంతకుమించిన పర్సనల్ బాండింగ్ ఏర్పడింది. కోహ్లీతోనే కాకుండా ప్లేయర్లందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉండటంతో శాస్త్రి పని మరింత సులువైంది. వీళ్ల హయాంలో అన్ని కండిషన్స్లో అదరగొట్టే పటిష్టమైన పేస్ బౌలింగ్ అటాక్ తయారైంది. దాంతో, టెస్టుల్లో ఇండియా తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2016 నుంచి 2020 వరకు 42 నెలల పాటు మన టీమ్ టాప్ ర్యాంక్లో కొనసాగింది.
బోర్డర్–గావస్కర్ ట్రోఫీల్లో డబుల్ ధమాకా
రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ గైడెన్స్లో ఇండియా 2018–19 టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఘనత సాధించిన ఆసియా తొలి టీమ్గా రికార్డుకెక్కింది. అలాగే 2020–21 టూర్లోనూ ఈ సక్సెస్ను రిపీట్ చేసింది. ఆసీస్ హోమ్గ్రౌండ్లో వరుసగా రెండోసారి బోర్డర్–గావస్కర్ ట్రోఫీని అందుకొని ఈ ఫార్మాట్లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఈ టూర్లో తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత కోహ్లీ, గాయాలతో పలువురు సీనియర్ ప్లేయర్ల సేవలు కోల్పోయినా.. శాస్త్రి, స్టాండిన్ కెప్టెన్ రహానె కుర్రాళ్లతోనే అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది ఇంగ్లంగ్ టూర్లో నాలుగు టెస్టుల తర్వాత 2–1తో లీడ్ సాధించింది. అలాగే, కరీబియన్ గడ్డపై టెస్టు సిరీస్లోవెస్టిండీస్ను తొలిసారి వైట్వాష్ చేసింది.
బైలేటరల్ సిరీస్ల్లో శాస్త్రి–కోహ్లీ జోడీ చాలా సక్సెస్ సాధించింది. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో ఇండియా టీ20 సిరీస్లు నెగ్గింది. ఈ ఘనత సాధించిన ఇండియా తొలి కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు. 2017లో శ్రీలంకలో 3–0తో సిరీస్నూ ఇండియా క్లీన్స్వీప్ చేసింది. ఇక, టీ20 కెప్టెన్గా కోహ్లీ 64 శాతం సక్సెస్ సాధించాడు. కెప్టెన్గా 50 మ్యాచ్ల్లో ఆడిన తను 35 టీ20ల్లో గెలిచాడు. కానీ, వన్డే వరల్డ్ కప్ (2019) సెమీఫైనల్, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(2021) ఫైనల్లో ఓటమితో పాటు ఈ టీ20 వరల్డ్కప్లో గ్రూప్దశలోనే ముగింపు తనతో పాటు శాస్త్రికి హార్ట్ బ్రేకింగ్ రిజల్ట్స్.
ఇక ద్రవిడ్ ఎరాలోకి
శాస్త్రి–కోహ్లీ సక్సెస్లో మిగతా కోచింగ్ స్టాఫ్ కృషి కూడా ఉంది. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పర్యవేక్షణలో ఎంతో మంది యంగ్స్టర్స్ టీమ్లోకి వచ్చి స్టార్లు అయ్యారు. ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ సైతం తనదైన పనితీరుతో మెప్పించాడు. భరత్, శ్రీధర్ పదవీకాలం కూడా వరల్డ్కప్తోనే ముగిసింది. ఇండియా క్రికెట్లో ఇప్పుడు కొత్త చీఫ్ కోచ్ ద్రవిడ్ ఎరా మొదలవుతోంది. టీ20ల్లో రోహిత్ కెప్టెన్ అవ్వడం లాంఛనమే కానుంది. వన్డే, టెస్టుల్లో కెప్టెన్గా కొనసాగినంత కాలం ద్రవిడ్, రోహిత్తో కోహ్లీ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది.