యూపీ సర్కార్ కీలక నిర్ణయం
లక్నో: హత్రాస్, బల్రాంపూర్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటనలపై ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ సరిగ్గా వ్యవహరించలేదని విపక్షాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తూ యూపీ గవర్నమెంట్ మిషన్ శక్తి అనే క్యాంపెయిన్ను షరూ చేసింది. తాజాగా ఈ క్యాంపెయినింగ్లో భాగంగా మహిళల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి పోలీసు స్టేషన్లలో ప్రత్యేక గ్లాస్ రూమ్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో సీక్రెట్ గ్లాస్ రూమ్లు ఏర్పాటు చేయనున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలోని 1,535 పోలీసు స్టేషన్లలో మహిళల హెల్ప్ డెస్క్ను ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ హెల్ప్ డెస్కుల్లో సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్తోపాటు పోలీసు అధికారులు, ఫిర్యాదుదారుల కోసం సీట్లను ఏర్పాటు చేశారు. అందరూ మహిళలను గౌరవించాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో మిషన్ శక్తి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు యోగి పేర్కొన్నారు.