- నెగెటివ్ అయినా ‘పాజిటివ్’ రిపోర్టులిస్తున్నరన్న సర్కార్
- ఎక్స్పర్ట్ కమిటీ విచారణలో తేలిందని హెల్త్ బులెటిన్లో ప్రకటన
- ఆ ల్యాబ్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ చెప్పిందని వెల్లడి
- ప్రైవేటులో టెస్టులను కంట్రోల్ చేసే యోచన!
హైదరాబాద్, వెలుగు: కరోనా టెస్టుల విషయంలో ప్రైవేటు ల్యాబ్లు రూల్స్ పాటించడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. నెగెటివ్ ఉన్నవాళ్లకు కూడా పాజిటివ్ అని చెబుతున్నట్టు తమ ఎక్స్పర్ట్ కమిటీ విచారణలో తేలిందని శుక్రవారం రాత్రి కరోనా బులెటిన్లో ప్రకటించింది. టెస్టులు, పాజిటివ్ కేసుల సంఖ్యను తప్పుగా చూపిస్తున్నట్టు గుర్తించామని పేర్కొంది. ఓ పెద్ద హాస్పిటల్లో ఉన్న ల్యాబ్లో 3,940 టెస్టులు చేసి, కేవలం 1,568 టెస్టులు చేసినట్టు తమ పోర్టల్లో అప్లోడ్ చేశారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇలా టెస్టుల సంఖ్యను తక్కువగా చూపడం వల్ల, టెస్ట్ పాజిటివ్ రేట్ ఎక్కువగా వస్తోందని పేర్కొంది. మొత్తం 16 ల్యాబుల్లో ఇన్స్పెక్షన్ చేసి, చాలా అవకతవకలను గుర్తించినట్టు వివరించింది. రూల్స్ బ్రేక్ చేసిన ల్యాబ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించిందని, మరోసారి పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రైవేట్ ల్యాబుల్లో క్వాలిటీ ఎట్లుందో చూడాలని ఐసీఎంఆర్ కూడా సూచించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఎక్స్పర్ట్ కమిటీ తేల్చిన అంశాలు
- ప్రైవేటు ల్యాబుల్లో స్టాఫ్ పీపీఈ కిట్లు వేసుకోవట్లేదు. ల్యాబుల్లో సేఫ్టీ కాబినేట్స్ లేవు. ల్యాబులను పరిశుభ్రంగా ఉంచడం లేదు. దీని వల్ల వచ్చేవారికి వైరస్ సోకే ప్రమాదం ఉంది.
- కరోనా టెస్టులు ఎట్ల చేయాల్నో ల్యాబ్ టెక్నీషియన్లకు ట్రైనింగ్ ఇవ్వలేదు. కొన్ని ల్యాబుల్లో క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ పాటించడం లేదు. స్టేట్ గవర్నమెంట్, ఐసీఎంఆర్ గైడ్లైన్స్కు విరుద్ధంగా.. ఎసింప్టమాటిక్ ఉన్నవాళ్లకు కూడా టెస్టులు చేస్తున్నారు.
- మరికొన్ని ల్యాబుల్లో పూల్ మెథడ్లో టెస్టులు చేస్తున్నారు. కొన్ని శాంపిల్స్ను కలిపి ఒకే శాంపిల్గా టెస్ట్ చేయడాన్ని పూల్ టెస్టింగ్ అంటారు. ఏదైనా పూల్ పాజిటివ్ వస్తే, అన్ని శాంపిల్స్ను వేర్వేరుగా టెస్ట్ చేయాలి. కానీ, ప్రైవేటు ల్యాబుల్లో పూల్ పాజిటివ్ వస్తే, ఆ పూల్లోని అన్ని శాంపిల్స్నూ పాజిటివ్గా ప్రకటిస్తున్నారు. అంటే, వైరస్ లేనివాళ్లకు కూడా ఉన్నట్టు చూపుతున్నారు.
- ఐసీఎంఆర్ పోర్టల్, స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ పోర్టల్, ల్యాబ్ రికార్డ్స్లో ఉన్న టెస్టుల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్యలో తేడా ఉంది. ప్రైవే టు ల్యాబులన్నీ కలిపి 9,577 టెస్టులు చేసినట్టు ఐసీఎంఆర్ పోర్టల్లో, 6,733 టెస్టులు చేసినట్టు స్టేట్ హెల్త్ పోర్టల్లో అప్లోడ్ చేశాయి. 2,076 పాజిటివ్స్ వచ్చినట్టు ఐసీఎంఆర్ పోర్టల్లో, 2,836 వచ్చినట్టు హెల్త్ పోర్టల్లో అప్లోడ్ చేశాయి. ల్యాబ్ రికార్డుల్లో.. 12,700 టెస్టులు చేస్తే, 3,571 పాజిటివ్స్ వచ్చినట్టు ఉంది. ప్రైవేలు ల్యాబులు పోర్టల్స్లో అప్లోడ్ చేసిన రికార్డులను, ల్యాబ్ ఇంటర్నల్ రికార్డులను పరిశీలిస్తే అవకతవకలు బయటప ఆరోగ్య శాఖ పేర్కొంది.
కంట్రోల్ చేసేందుకే?
ప్రైవేటు ల్యాబుల్లో కరోనా టెస్టులు మొదలవగానే, చాలా మంది టెస్టుల కోసం క్యూ కట్టారు. సింప్టమ్స్ ఉన్నవాళ్లు, లేనివాళ్లూ టెస్ట్ చేయించుకుంటుండడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రైవేటు ల్యాబులను కట్టడి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా విషయంలో అన్నీ విషయాలను దాస్తూ వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ.. ప్రైవేట్ ల్యాబుల్లో ఇన్స్పెక్షన్ చేశామని బులెటిన్లోనే పేర్కొంది. ల్యాబుల పేరు చెప్పకుండా.. కొన్ని ల్యాబుల్లో క్వాలిటీ లేదని, తప్పుడు లెక్కలు ఇస్తున్నారని ప్రకటించింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వకముందు నుంచే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అనుబంధ ల్యాబుల్లో కరోనా టెస్టులు చేశారు. ఈ విషయం తెలిసినా చప్పుడు చేయని సర్కార్.. ఇప్పుడు అక్కడ బాగోలేదని ప్రకటిస్తుండడం అనుమానాలకు దారితీస్తోంది. ఇన్నిరోజుల్లో ఎప్పుడూ లేనట్టు తొలిసారి 5పేజీలతో శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. ప్రైవేటు ల్యాబుల్లో ఇన్స్పెక్షన్, వాటిలో లోపాలనే మూడు పేజీల్లో పేర్కొంది.