
ఆడియెన్స్ హాయిగా నవ్వుకునేలా ‘మిత్ర మండలి’ చిత్రం ఉంటుందని నిర్మాతలు కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప అన్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ లీడ్గా విజయేందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అక్టోబర్ 16న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘బన్నీ వాస్ మాకు మంచి స్నేహితులు. గీతా ఆర్ట్స్లో చాలా కాలం కలిసి పని చేశాం. వాసు వినమని చెప్పిన ఈ కథ మాకు బాగా నచ్చింది. దీంతో కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నిర్మించాం.
సెటైరికల్ కామెడీ మూవీ ఇది. దర్శకుడు విజయేందర్ కథను ఎంత బాగా రాసుకున్నాడో.. అంతే బాగా తీశాడు. తనకు ఇదే తొలిచిత్రం అనిపించలేదు. ప్రతి పాత్రకు ఆయన తీసుకున్న ఆర్టిస్ట్లు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ‘జంగ్లీ పట్టణం’ అనే ఓ ఫిక్షనల్ టౌన్లో జరిగే కథ ఇది. అందులోని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం ఎక్కువగా యూత్కు రిలేట్ అవుతుంది. ఈ సినిమా కోసం లేని ఓ కులం పేరుని క్రియేట్ చేశాం.
ఆ ఫిక్షనల్ క్యాస్ట్ కారణంగా సమాజంలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ సెటైరికల్గా నవ్విస్తాయి. ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహారా, విష్ణు ఓయ్, వీటీవీ గణేష్, వెన్నెల కిశోర్, సత్య ఇలా అందరూ బిజీ ఆర్టిస్టులు కావడంతో వారి డేట్లను అడ్జస్ట్ చేసుకోవడం సవాల్గా అనిపించింది. బ్రహ్మానందం గారు ‘జంబర్ గింబర్ లాలా’ అనే పాటలో మాత్రమే కనిపిస్తారు. అయినా చాలా బాగా సపోర్ట్ చేశారు. దీపావళి సీజన్ కనుక ఎన్ని సినిమాలు వచ్చినా జనం చూస్తారనే నమ్మకంతో 16న వస్తున్నాం. త్వరలోనే ఓ హారర్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాం’ అని చెప్పారు.