- వెల్లడించిన వాతావరణ కేంద్రం
- అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం
- కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలపైనే టెంపరేచర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాబోయే వారం రోజుల పాటు మిక్స్డ్ వెదర్ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఎండలు, మరికొన్ని జిల్లాల్లో వానలు ఉంటాయని తెలిపింది. మంగళవారం నుంచి ఆదివారం వరకు ఆరు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్, నాగర్కర్నూల్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో రాబోయే నాలుగు రోజులు ఎండలు ఎక్కువగా ఉంటాయని ఐఎండీ ప్రకటించింది. 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో వర్ష సూచన ఉన్నప్పటికీ, ఎండలు కూడా ఉండనున్నాయి. ఈ జిల్లాల్లో 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోమవారం మోస్తరు వర్షాలు కురిశాయి. రాబోయే 48 గంటలు కూడా పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది. కనిష్టంగా 25 డిగ్రీలు, గరిష్టంగా 37 డిగ్రీల వరకు టెంపరేచర్లు రికార్డయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
