అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో నీ సంగతి చూస్తా : ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్​

అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో నీ సంగతి చూస్తా : ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్​
  • అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో నీ సంగతి చూస్తా
  • ఇల్లెందు ఎంపీపీ భర్తను బెదిరించిన ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్​
  • సోషల్​ మీడియాలో చక్కర్లు కొడ్తున్న వాయిస్​ రికార్డ్​

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ‘నువ్వు కాంగ్రెస్​ పార్టీలోకి పోతున్నవ్. గెలిచేది బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరిప్రియనే. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో నీ సంగతి చూస్తా’ అంటూ ఇల్లెందు ఎమ్మెల్యే భానోత్​ హరిప్రియ భర్త హరిసింగ్..ఇల్లెందు ఎంపీపీ చీమల నాగరత్నమ్మ భర్త జానీని బెదిరించిన ఫోన్​ కాల్ ​వాయిస్​ రికార్డ్​ సోషల్​ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నది.  ఇల్లెందు ఎంపీపీ చీమల నాగరత్నమ్మతో పాటు పలువురు రెండు రోజుల కింద  బీఆర్ఎస్​ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్​పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడంతో ఎమ్మెల్యే హరిప్రియ సింగ్​ భర్త హరిసింగ్​ బుధవారం ఎంపీపీ భర్త జానీకి ఫోన్​ చేసి బెదిరించారు. 

అందులో  ‘జానన్న నమస్తే.. కనకన్న రేపు గెలవకపోతే అప్పుడు నీ సంగతేంది?  అప్పుడైతే హరిసింగ్​ఊరుకోడు కదా. నువ్​ఎక్కడెక్కడ వేలు పెట్టినవ్..​ ఎక్కడెక్కడ ఏం చేసినవో.. అన్నీ తెలుసు...ఏదీ వదిలిపెట్టం. వంద శాతం తవ్వుతం. నువ్వు ఏం చేసినవో అన్నీ చూస్తాం. నీ భూములు, నీ కబ్జాలు అన్నీ అప్ ​టూ డేట్​ఉన్నయ్. నీ కోసం అన్నీ చేసిన. ఎమ్మార్వోకు చెప్పా. దొంగ పనులు చేసుకుంటూ వెళ్తున్నవ్. పొంగులేటి కాదు వాళ్ల జేజమ్మ వచ్చినా హరిప్రియ గెలుపును ఆపలేరు. 20 రోజులు చాలు నీ సంగతి చూసేందుకు’ అని వార్నింగ్​ ఇచ్చాడు. ఈ విషయమై ఎంపీపీ భర్త జాని మాట్లాడుతూ హరిసింగ్​ తనకు ఫోన్​ చేసి  బెదిరించాడని,  అతడి నుంచి ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని కోరాడు.