- ముగిసిన ఖోఖో క్రీడలు
అమీన్పూర్, పటాన్చెరు, వెలుగు: జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలకు వేదికగా పటాన్చెరు పట్టణాన్ని తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చెప్పారు. పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న ఖోఖో క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ, రంగారెడ్డి జిల్లా జట్టు ద్వితీయ , హైదరాబాద్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ఆదిలాబాద్ ప్రథమ, మహబూబ్నగర్ ద్వితీయ, నల్లగొండ తృతీయ స్థానంలో నిలిచాయి.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..రూ.7కోట్లతో మైత్రి మైదానాన్ని ఆధునీకరించామని చెప్పారు. ఏడాది పొడవునా క్రీడలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, సీఐ వినాయక్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరికిషన్, ప్రధానకార్యదర్శి శ్రీకాంత్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
నూతన కాలనీలకు స్వచ్ఛ జలాలు
పటాన్చెరు నియోజకవర్గంలోని నూతన కాలనీలకు మిషన్ భగీరథ, జలమండలి ద్వారా స్వచ్ఛ జలాలను అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలోని అపార్ట్మెంట్ వాసులకు జలమండలి ద్వారా తాగునీటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నూతన రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని రామాలయం జీర్ణోధారణ పనులకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. హానర్ ల్యాబ్ పరిశ్రమ సహకారంతో రూ.1.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఆలయ ప్రాకారం పనులకు శంకుస్థాపన చేశారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన ఆలయాన్ని దైవత్యం ఉట్టిపడేలా పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దశరథ్, మాజీ జడ్పీటీసీ కుమార్గౌడ్, నాయకులు విజయభాస్కర్రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు బాల్రెడ్డి, పరిశ్రమ ప్రతినిధి రవీందర్రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
