ప్రాణహితపై పాలిటిక్స్‌‌..సవాళ్లు.. ప్రతిసవాళ్లతో హీటెక్కిన కాగజ్‌‌నగర్‌‌ రాజకీయం

ప్రాణహితపై పాలిటిక్స్‌‌..సవాళ్లు.. ప్రతిసవాళ్లతో హీటెక్కిన కాగజ్‌‌నగర్‌‌ రాజకీయం
  • ప్రాజెక్ట్‌‌పై బహిరంగ చర్చకు సవాల్‌‌ చేసిన ఎమ్మెల్యే హరీశ్‌‌బాబు
  • సవాల్‌‌ను స్వీకరించి తుమ్మడిహెట్టికి పయనమైన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
  • ఇద్దరినీ హౌస్‌‌ అరెస్ట్‌‌ చేసిన పోలీసులు

ఆసిఫాబాద్/కాగజ్‌‌నగర్‌‌, వెలుగు : ప్రాణహితపై చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్‌‌ చేయడం... దాన్ని మాజీ ఎమ్మెల్యే స్వీకరించి చర్చకు వచ్చేందుకు సిద్ధపడడంతో కాగజ్‌‌నగర్‌‌లో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. ప్రాణహిత ప్రాజెక్ట్‌‌ నిర్మాణంపై సిర్పూర్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మధ్య కొంతకాలంగా వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్‌‌ చేయగా... దాన్ని స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే చర్చకు హాజరయ్యేందుకు బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ హౌస్‌‌ అరెస్ట్‌‌ చేశారు.

బహిరంగ చర్చకు రావాలని హరీశ్‌‌బాబు సవాల్‌‌

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నాలుగు రోజుల కింద చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ప్రాణహిత ప్రాజెక్ట్‌‌ కట్టొద్దని గతంలోనే హరీశ్‌‌బాబు తల్లి, మాజీ ఎమ్మెల్యే రాజ్యలక్ష్మి ధర్నా చేశారని, ప్రాజెక్ట్‌‌ కట్టాలని ఇప్పుడు హరీశ్‌‌బాబు డిమాండ్‌‌ చేస్తున్నారని కోనప్ప చెప్పారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే హరీశ్‌‌బాబు మంగళవారం కాగజ్‌‌నగర్‌‌లోని తన ఇంట్లో ప్రెస్‌‌ మీట్‌‌ నిర్వహించారు. తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్ట్‌‌ నిర్మాణంపై బహిరంగ చర్చకు రావాలని హరీశ్‌‌బాబు సవాల్‌‌ విసిరారు. 

రంగంలోకి పోలీసులు.. ఇద్దరు హౌస్‌‌ అరెస్ట్‌‌

హరీశ్‌‌బాబు సవాల్‌‌ను స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం కౌటాల మండలం తుమ్మడిహెట్టికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను కాగజ్‌‌నగర్‌‌లోని ఇంట్లో హౌస్‌‌ అరెస్ట్‌‌ చేశారు. అలాగే కౌటాల మండల కేంద్రంలో కార్యకర్తలతో ర్యాలీగా వస్తున్న జడ్పీ మాజీ చైర్మన్‌‌ కోనేరు కృష్ణారావును పోలీసులు అడ్డుకున్నారు. మరో వైపు ఎమ్మెల్యే హరీశ్‌‌బాబు సైతం తుమ్మడిహెట్టి వద్దకు వెళ్లకుండా ఇంట్లోనే నిర్బంధించారు. ఎమ్మెల్యే హరీశ్‌‌బాబుకు మద్దతుగా ఆయన వర్గీయులు తుమ్మిడిహెట్టి వద్దకు వెళ్లగా... పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత హరీశ్‌‌బాబు, కోనప్ప వేర్వేరుగా ప్రెస్‌‌మీట్లు నిర్వహించారు. ఎలాంటి గొడవలు జరగకుండా కాగజ్‌‌నగర్‌‌ డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలీసులను అడ్డుపెట్టుకుని చర్చకు రాకుండా ముఖం చాటేశారు : ఎమ్మెల్యే హరీశ్‌‌బాబు

మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని సిర్పూర్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌బాబు సూచించారు. ప్రాజెక్ట్‌‌పై బహిరంగ చర్చకు తాను ఒక్కడినే వచ్చేందుక సిద్ధపడితే.. కోనప్ప మాత్రం కాగజ్‌‌నగర్‌‌, కౌటాలలో జనాలను పోగు చేసి లా అండ్‌‌ ఆర్డర్‌‌ సమస్యను సృష్టించి, పోలీసులను అడ్డుపెట్టుకొని చర్చకు రాకుండా ముఖం చాటేశారని విమర్శించారు. కాగజ్‌‌నగర్‌‌లోని ఇంట్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌‌ విషయంలో సమాధానం చెప్పుకోలేక డ్రామాలు ఆడుతున్నారన్నారు.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌‌ను కాళేశ్వరానికి తరలిస్తే ఏనాడూ మాట కూడా మాట్లాడని కోనప్ప.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌‌ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తుమ్మిడిహెట్టి విషయంలో ప్రధాన ముద్దాయి కోనప్పేనని అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రాజెక్ట్‌‌ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడానని, ప్రాజెక్ట్‌‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేయడంతో ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. తూర్పు ఆదిలాబాద్‌‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఎడారిగా మారుతుంటే గత పదేండ్లు ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్ట్‌‌ విషయంలో ఎవరు అన్యాయం చేశారో నియోజకవర్గ ప్రజలకు తెలుసునని, కోనప్ప ఎన్ని డ్రామాలు ఆడినా ఆయనను నమ్మబోరన్నారు. 

ప్రాణహిత వద్దని తల్లి ధర్నా చేస్తే.. కొడుకు కట్టాలని అంటుండు : మాజీ ఎమ్మెల్యే కోనప్ప

హౌస్ అరెస్ట్ అనంతరం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌‌ కట్టవద్దని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌‌ తల్లి, మాజీ ఎమ్మెల్యే రాజ్యలక్ష్మి గతంలో ధర్నా చేశారని.. ఇప్పుడు ప్రాజెక్ట్‌‌ కట్టాలని ఆమె కొడుకు ఎమ్మెల్యే హరీశ్‌‌ బాబు అడుగుతున్నారని.. ప్రాజెక్ట్‌‌ విషయంలో తల్లీకొడుకులకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్ట్‌‌ కట్టొద్దని తాను ఎప్పుడూ అనలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్‌‌తో శంకుస్థాపన చేయించానని, ప్రాజెక్ట్ నిర్మించాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు.

అయితే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవేళ్ల నిర్మించొద్దని సీడబ్ల్యూసీ రిపోర్ట్‌‌ ఇవ్వడం వల్లే.. ప్రాజెక్ట్‌‌ను అప్పటి సీఎం కేసీఆర్‌‌ కాళేశ్వరానికి తరలించారని గుర్తు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా గుండాయిపేట వద్ద బ్యారేజీని ప్రతిపాదించి ఉమ్మడి ఆదిలాబాద్‌‌లోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తామని కేసీఆర్ చెప్పారని అన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌‌బాబు తన హాస్పిటల్‌‌ కోసం ఈఎస్ఐ హాస్పిటల్‌‌ను మూసేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొండపల్లిలో పోడు భూముల సమస్యను పరిష్కరించి... రైతులపై కేసులు ఎత్తివేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినా.. ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. సిర్పూర్‌‌ పేపర్‌‌ మిల్లులో నాలుగు వేల మంది స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌‌ చేస్తుంటే.. దానిని కప్పిపుచ్చుకునేందుకు ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.