
సిద్దిపేట, వెలుగు: పామాయిల్ రైతుల పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బుధవారం నంగునూరు మండలం నర్మేట లో నిర్మాణం లో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించి మాట్లాడారు. సిద్దిపేట జోన్ లో రూ. 300 కోట్లతో ఆసియా ఖండంలోనే అత్యుత్తమమైన ఫ్యాక్టరీ నిర్మించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఆయిల్ పామ్ సాగుతో పాటు ఫ్యాక్టరీ ఇక్కడికి వచ్చిందన్నారు. అన్ని జిల్లాలో ఆయిల్ పామ్ సాగు కు సహకరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఎక్కడ ఆయిల్ పామ్ సాగు చేయలేదని విమర్శించారు.
బీజేపీ దేశంలోని రైతులను చిన్నచూపు చూస్తుందని మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకుందన్నారు. కార్పొరేట్లకు న్యాయం చేయడానికి దిగుమతి సుంకం తగ్గించి రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ప్రతి ఏడాది లక్ష కోట్ల విలువైన పామాయిల్ను మనం దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఆగస్టు 2వ వారంలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం అవుతుందని రైతులకు ట్రాన్స్ పోర్టు ఛార్జీలు వెంటనే చెల్లించి రిఫైనరీ ప్యాకింగ్ యూనిట్ కి టెండర్ పిలిచి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సిద్దిపేట నియోజకవర్గంలోని 227 మంది లబ్ధిదారులకు రూ.50 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు పంపిణీ చేశారు.