
భద్రాచలం, వెలుగు : చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఆపరేషన్ థియేటర్ను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. మారుమూల చత్తీస్గఢ్ బార్డర్లో ఉండే ఈ ప్రాంతంలోని గిరిజనులకు అన్ని రకాల ఆపరేషన్లు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కోసం 60 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు స్థానికంగానే ఆపరేషన్లు నిర్వహిస్తారని చెప్పారు. మొదటి రోజే ఐదు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేశారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ డా.రవిబాబు, భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, డాక్టర్ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ప్రయాణంతో లాభపడ్డారు
ఉచిత ప్రయాణంతో మహిళలు లాభపడ్డారని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. రూ.200కోట్ల ఉచితప్రయాణం మహాలక్ష్మి ద్వారా లబ్ధిపొందిన సందర్భంగా బుధవారం భద్రాచలం ఆర్టీసీ డీపో ఆవరణలో ప్యాసింజర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలతో ఆయన స్వయంగా మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. అన్ని రకాలుగా ఉచిత బస్సు ప్రయాణంను వినియోగించుకున్నామని వారు తెలిపారు. అనేక విధాలుగా రేవంత్రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసీ మహిళా సిబ్బందిని సత్కరించారు. స్టూడెంట్లకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.