
జనగామ, వెలుగు : గడిచిన 21 నెలల్లో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి రూ.1,026 కోట్ల అభివృద్ధి నిధులు తెచ్చానని, వచ్చే మూడేండ్లలో మరో రూ.2 వేల కోట్లను తెచ్చి అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం ఆయన లింగాల ఘన్పూర్ మండలం నెల్లుట్లలోని కేబీఆర్ఫంక్షన్ హల్లో 67 మంది కల్యాణలక్ష్మి, 32 మంది సీఎంఆర్ఎఫ్లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజు నుంచి నేటి వరకు మంజూరు అయిన పనుల వివరాలను ప్రజల ముందు పెట్టానన్నారు. లింగాల ఘన్పూర్ మండలంలోని ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు అందాయన్నారు. వచ్చే శ్రీరామ నవమి లోపు జీడికల్ రోడ్డు పనులు పూర్తి చేయడంతోపాటు జీడికల్ చెరువును గోదావరి జలాలతో నింపుతానన్నారు.