
దండేపల్లి, వెలుగు: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. రైతు భరోసా కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేశామని తెలిపారు. శనివారం దండేపల్లి మండల కేంద్రంలో రైతులు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులైన ఉపాధిహామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేలను త్వరలోనే వారి ఖాతాలో జమ చేస్తామన్నారు. లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్, ఆర్జీపీఎస్ జిల్లా చైర్మన్ త్రిమూర్తి, మాజీ జడ్పీటీసీ గడ్డం నాగరాణి, దండేపల్లి, లక్సెట్టిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, పింగిలి రమేశ్ పాల్గొన్నారు.
ఫోన్ చేయండి.. వాలిపోతా
ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయండి.. వాలిపోతానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఉపాధ్యాయులు, విద్యార్థినులకు సూచించారు. శనివారం దండేపల్లి కేజీబీవీ, లింగాపూర్ మోడల్ స్కూల్ ను సందర్శించారు. కొత్తగా నిర్మిస్తున్న తరగతి గదులను పరిశీలించారు. హాస్టల్వసతి, భోజనం విషయంలో ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేజీబీవీ పరిసరాల్లో కోతుల బెడద నివారించేందుకు ప్రహరీ విద్యుత్ ఫెన్సింగ్ వేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రహరీని ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని ఎంపీడీవో ప్రసాద్ ను ఆదేశించారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేశ్, కేజీబీవీ ఇన్చార్జి స్పెషల్ఆఫీసర్భాగ్య ఉన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి భవన పనులు పరిశీలన
లక్సెట్టిపేట, వెలుగు: లక్షెట్టిపేట పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన పనులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు శనివారం పరిశీలించారు. జూలై 3న ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల 10న లేదా 12న ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్పొరేట్ కు దీటుగా నిర్మిస్తున్న ఈ ఆస్పత్రితో లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఎండీ.ఆరిఫ్, చెల్లా నాగభూషణం, చింత అశోక్, అంకతి శ్రీనివాస్, మడిపల్లి స్వామి పాల్గొన్నారు.