జహీరాబాద్ లో ఆర్అండ్ బీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

జహీరాబాద్ లో ఆర్అండ్ బీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

జహీరాబాద్, వెలుగు: రోడ్ల మరమ్మతులో నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్ అండ్ బీ అధికారులపై ఎమ్మెల్యే మాణిక్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం జహీరాబాద్ సమీపంలోని బైపాస్ రోడ్డుకు అనుకొని ఉన్న అల్గోల్ రోడ్డును ఆయన పరిశీలించారు. గుంతలమయమైన రోడ్డును ఎందుకు పట్టించుకోవడంలేదని ఆర్అండ్ బీ ఈఈ , ఎస్ఈలతో ఫోన్ చేసి నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డు నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేశామన్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తొందరగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని లేదంటే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండప్ప, నాయకులు రవికిరణ్, యాకూబ్, మొహియుద్దీన్, మిథున్ రాజ్, శివప్పా, పురుషోత్తం రెడ్డి, దీపక్, నరేశ్ రెడ్డి, సందీప్, ఫయాజ్, అశోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ ఉన్నారు.