వరంగల్/ హనుమకొండ సిటీ/ పర్వతగిరి, వెలుగు: అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడమే రాష్ట్రంలో నిర్వహించే సీఎం కప్ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నియోజకవర్గస్థాయి సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యత క్రీడాభివృద్ధికే ఇస్తోందన్నారు.
సీఎం రేవంత్రెడ్డి స్వయంగా క్రీడాకారుడు కావడంతో ఆ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం ఐదంచెల పోటీలు నిర్వహిస్తోందన్నారు.
శాట్ అబ్జర్వర్ నందకిషోర్ గోకుల్, హనుమకొండ డీవైఎస్ వో గుగులోతు అశోక్ కుమార్ ఈ నెల 9, 10 తేదీల్లో హనుమకొండ జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు తోట శ్యాం ప్రసాద్, సృజన్ కాంత్, లిల్లీ ఫ్లోరెన్స్, శ్రీధర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి హైస్కూల్లో ఏర్పాటు చేసిన సీఎం కప్ మండల స్థాయి క్రీడాపోటీలను ఎంపీడీవో శంకర్ నాయక్, పర్వతగిరి సీఐ రాజగోపాల్ ప్రారంభించారు.
