
- డీఈవోను సస్పెండ్ చేయాలి
- ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి
భైంసా, వెలుగు: కుభీర్ మండలంలోని అంతర్నీ ప్రభుత్వ స్కూల్లో శిథిలావస్థలో ఉన్న భవనం కూలి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా భైంసా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శనివారం పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న భవనాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే ఈ ఘటన జరిగిందన్నారు.
బాధ్యులైన డీఈవోను వెంటనే సస్పెండ్ చేసి, పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని స్కూళ్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడినా లాభం లేకుండాపోయిందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను కూల్చివేసి కొత్తవాటిని నిర్మించేలా ప్రతిపాదనలు తేవాలన్నారు.
మోదీ 11 ఏండ్ల పాలనలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు
దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన పాలనలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారని రామారావ్ పటేల్ అన్నారు. మోదీ 11 సంవత్సరాల పాలనపై భైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. నోట్ల రద్దు చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఆపరేషన్ సిందూర్ తో శత్రు దేశాన్ని గజగజలాడించారని పేర్కొన్నారు. 370 ఆర్టికల్ను రద్దు చేశారని పేర్కొన్నారు. మోదీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యాయని గుర్తుచేశారు. 11సంవత్సరాల పాలన ప్రోగ్రాం కన్వీనర్గా ఎన్నికైనా ముల్లవార్ అనిల్, కో కన్వీనర్ బండారి దిలీప్ను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, పట్టణ అధ్యక్షుడు రావుల రాము, జిల్లా కార్య
వర్గ సభ్యులు ఎ.మల్లేశ్, నాయకులు రవి, దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు.