గడప గడపకు మోదీ అభివృద్ధి పనులు : రఘునందన్​రావు

గడప గడపకు మోదీ అభివృద్ధి పనులు : రఘునందన్​రావు

మనోహరాబాద్, వెలుగు:  కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లి బీజేపీకి మద్దతు కూడగట్టాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని దండుపల్లి శుభం గార్డెన్ లో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు రూపొందించి అమలు చేస్తోందన్నారు.

ఆయా పథకాల గురించి క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఇండియా కూటమి కుక్కలు చింపిన విస్తరాకులా విడిపోయిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు నెలల్లో తొమ్మిది వేల కోట్ల అప్పు ఇచ్చిందని తెలిపారు.  బీజేపీ ఎంపీ లేనప్పటికీ హైదరాబాద్​శివారు సుచిత్ర నుంచి మెదక్ జిల్లాలోని కాళ్లకల్ వరకు నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ స్థానంలో బీజేపీ గెలుపునకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ లోక్​సభ ఇన్ చార్జి, సిర్పూర్ కాగజ్​నగర్​ ఎమ్మెల్యే హరిబాబు, మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ నాయకులు మురళీ యాదవ్, పులిమామిడి రాజు, పంజా విజయ్ కుమార్ పాల్గొన్నారు.