
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక కమలం పార్టీలో కల్లోలం రేపింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రర్ రావు నియామకంపై తీవ్ర అంసృప్తితో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికకు నామినేషన్ వేయడానికి వస్తే.. నన్ను నామినేషన్ వేయనివ్వలేదని ఆరోపించారు.
నాకు మద్దుతు ఇచ్చిన వారిని కూడా ఫోన్ చేసి బెదిరించారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కేవలం నామామాత్రంగా జరుగుతోందని.. ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో ఆల్రెడీ ముందే డిసైడ్ చేశారన్నారు. బీజేపీ సింబల్ పై గెలిచి ఎమ్మెల్యేగా ఉండటం సరికాదని.. అందుకే తన శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ ను కోరాలని కిషన్ రెడ్డికి చెప్పానని అన్నారు.
ALSO READ | రాజాసింగ్ రాజీనామా: బీజేపీకి గుడ్ బై
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావొద్దని అనుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఎంతో కష్టపడుతున్నామని.. కానీ మాకు పార్టీలోనైనా సరైన గుర్తింపు దక్కడం లేదని వాపోయారు. ఇక బీజేపీలో కొనసాగలేనని.. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఎంపిక షాకింగ్కి గురి చేసిందన్నారు. బీజేపీ కోసం సర్వంధార పోసి నేను, నా కుటుంబం ఉగ్రవాదులకు టార్గెట్గా మారామన్నారు. బీజేపీకి రాజీనామా చేసినప్పటికీ హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానని రాజాసింగ్ పేర్కొన్నారు. ఇన్నాళ్లు పార్టీలో సహకరించిన వారిందరికి ఈ సందర్భంగా రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు.