మెదక్ జిల్లాలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు : ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్ జిల్లాలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు : ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్, వెలుగు: నిరుపేదలకు అండగా నిలబడి, వారికి నిలువ నీడ ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. గురువారం కలెక్టరేట్ లో  ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, హౌసింగ్ పీడీ మాణిక్యం, డీపీవో యాదయ్య తో  కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయన్నారు. ఎమ్మెల్యేగా  గెలిచిన 14 నెలల్లోనే నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామన్నారు. విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ  క్షేత్రస్థాయిలో సదుపాయాలు కల్పిస్తూ ప్రజలలో మమేకమై పనిచేస్తున్నామన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారు ఇంటి నిర్మాణ సామగ్రిని ఒకేసారి కొనుగోలు చేస్తే ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు.

మేస్త్రీలను స్థానికంగా ఎంపిక చేసుకుంటే ఖర్చు తగ్గించుకోవచ్చని సూచించారు. ఇంటి నిర్మాణానికి కావలసిన ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నందున ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులు ప్రోసిడింగ్ పత్రం పొందినవారు వెంటనే పంచాయతీ సెక్రెటరీనీ సంప్రదించి ముగ్గు పోసుకొని నిర్మాణం ప్రారంభించాలన్నారు.

బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం పూర్తయితే లక్ష రూపాయలు, రూఫ్ లెవల్ స్థాయి దాటిన తర్వాత లక్ష రూపాయలు, స్లాబ్ పూర్తయ్యాక రూ.2 లక్షలు, మొత్తం పనులు పూర్తయ్యాక మిగిలిన లక్ష రూపాయలతో కలిపి  రూ.5 లక్షలను ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లిస్తోందన్నారు. కార్యక్రమంలో సంబంధిత మండలాల ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.