ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు పక్కా ఇళ్లు : ఎమ్మెల్యే రోహిత్ రావు 

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు పక్కా ఇళ్లు : ఎమ్మెల్యే రోహిత్ రావు 

మెదక్, వెలుగు: ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతే మెదక్ నియోజకవర్గంలో పేదలకు ‌ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. శుక్రవారం హవేలి ఘనపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 450 మంది ఇందిరమ్మ ఇండ్ల ‌లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు పదేళ్ల కాలంలో కనీసం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మండలానికి వెళ్లినా, ఏ గ్రామం పోయి చూసినా గతంలో ఇందిరమ్మ  రాజ్యంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు దర్శనమిస్తాయన్నారు. చెప్పిన విధంగానే ‌అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేపట్టి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. హౌసింగ్ పీడీ మాణిక్యం ఉన్నారు. అనంతరం పాపన్నపేట మండల పరిధిలోని పాతలింగాయిపల్లి గ్రామంలో నిర్వహించిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ శిఖర ప్రతిష్ఠ ఉత్సవాల్లో ఎమ్మల్యే పాల్గొన్నారు. ఆయన వెంట ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్, నరేందర్ గౌడ్, శ్రీనివాస్, నారాయణ ఉన్నారు. 

సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం

రామాయంపేట/నిజాంపేట్: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టినట్లు ఎమ్మెల్యే రోహిత్ రావు తెలిపారు. శుక్రవారం రామాయంపేటలో 366 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను  పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సన్నబియ్యం సమర్థ వంతంగా అమలవుతుందని, పట్టణంలోని బైపాస్ రోడ్డులో 25 ఎకరాల్లో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు.

నిజాంపేటలోని మార్కెట్ యార్డులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్​ను, బాధితులకు సీఎంఆర్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సుప్రభాతరావు, మండల అధ్యక్షుడు వెంకటేశ్, ఎంపీడీవో రాజిరెడ్డి, బాబు, అమర సేనారెడ్డి, స్వామి, బాలరాజ్, భూపతి రెడ్డి పాల్గొన్నారు.