- కంటోన్మెంట్ బోర్డు అధికారులను కోరిన ఎమ్మెల్యే శ్రీగణేశ్
పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ బోర్డు సీఈవో అరవింద్ ద్వివేది, డీఈవో దినేశ్ రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేశ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.స్టేట్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులకు కంటోన్మెంట్ బోర్డు నుంచి మంజూరు కావాల్సిన ఎన్వోసీలు ఆలస్యంగా రావడం వల్ల పనులు కుంటుపడుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఎన్వోసీలు త్వరితగతిన జారీ చేస్తే అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయవచ్చన్నారు. దీనిపై స్పందించిన బోర్డు అధికారులు అవసరమైన ఎన్వోసీలు త్వరగా మంజూరు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
