గిరిజనుల విద్యకు సర్కారు పెద్దపీట : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

గిరిజనుల విద్యకు సర్కారు పెద్దపీట : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
  • ఒడిశాలో అవగాహన

ఖానాపూర్, వెలుగు: ఆదివాసీల జీవితాల్లో మార్పు కేవలం నాణ్యమైన విద్యతోనే సాధ్యమవుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఒడిశాలోని కియేంఝర్ పట్టణ కేంద్రంలో గోండు సంస్కృతిక సమాజ్ ఆధ్వర్యంలో ‘విద్య, దాని ప్రాముఖ్యత’ అనే అంశంపై శనివారం నిర్వహించిన సమావేశంలో బొజ్జు పటేల్​చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను వివరించారు. 

విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి అన్ని వర్గాలకు గుణాత్మక విద్యను అందించేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు శ్రద్ధగా క్లాసులు వినేలా అమలు చేస్తున్న విద్యా విధానాన్ని వివరించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ విద్యార్థులకు విద్య, భోజన వసతి కల్పించడంతోపాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.

 ఫలితంగా రాష్ట్రంలో ఆదివాసీల అక్షరాస్యత శాతం మెరుగుపడిందన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో గిరిజనుల కోసం ఆశ్రమ, గురుకులాలు, టీడబ్ల్యూఎస్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలు అందుబాటులోకి తెచ్చి ఆధునూతన సైన్స్ ల్యాబ్​లు, లైబ్రరీలను ఏర్పాటు చేసి అనుభవజ్ఞులతో కార్పోరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామని తెలిపారు. విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, ఆదివాసీ యువత ఉన్నత చదువులు చదువుకొని అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీ ఎస్​జే అనంత్, అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.