
- త్వరలో ఏర్పాటు కానుందన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- నియోజకవర్గంలో విస్తృత పర్యటన
- పలు అభివృద్ధి పనులకు ప్రారంభం
- లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందజేత
కోల్ బెల్ట్/చెన్నూరు: చెన్నూరులో త్వరలో 100 పడకల దవాఖాన ఏర్పాటు కానుందని స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆసుపత్రి ఏర్పాటుకు అవసరమైన క్లియరెన్స్ తుదిదశలో ఉందన్న ఆయన అందుకు అవసరమైన అదనపు సిబ్బంది కోసం ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఇవాళ ఆయన బెల్లంపల్లి, జైపూర్, భీమారం, చెన్నూరు మండలాల్లో పర్యటించారు.
చెన్నూరు ఎంపీడీవో ఆఫీస్ ఏరియాలో రూ.13 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించారు. అదే విధంగా జైపూర్ మండలం షేట్పల్లి, శివ్వారం, కిష్టాపూర్, వేలాల, పౌనూర్, కుందారం,నర్సింగాపూర్, బెజ్జల గ్రామల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రొసీడింగ్స్ పంపిణి చేశారు. పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వాదించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. దవాఖానకు వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మర్యాదగా ఉండాలన్నారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీళ్లు కలుషితం అయితే జబ్బులు వస్తాయని, తాగునీటి సరఫరా కోసం బ్లీచింగ్ పౌడర్ వాడాలన్నారు.