బీఆర్ఎస్తోనే బంగారు భవిష్యత్తు : ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్తోనే బంగారు భవిష్యత్తు : ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కారు గుర్తుతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రమంతా కటిక చీకట్లు అలుముకుంటాయని అన్నారు. చెరువులు నిండినా, ఎండిపోయినా చేపలు అక్కడే ఉంటాయి.. కప్పలు మాత్రమే చెరువు నుంచి బయటికి వెళ్తాయి.. బీఆర్ఎస్ పార్టీ చేపల వంటిది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కప్పల వంటి వాళ్లు అని చెప్పారు. జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్, బీర్పూర్, జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఉద్యమ సమయంలో అధికారంలో లేనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో ఉందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉందన్నారు. కష్టాల్లో, సంతోషాల్లోనూ ప్రజలతోనే బీఆర్ఎస్ ఉంటుందని చెప్పారు. రుణమాఫీ నిధులు విడుదల కానివ్వకుండా ఎన్నికల సంఘానికి కాంగ్రెస్  అభ్యర్థి జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. తెలంగాణ రాక ముందు పరిస్థితి ఎలా ఉండేది..? ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని కోరారు. 

పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో పుష్కలమైన సాగునీటి వనరుల వల్ల రాష్ట్రంలో ధాన్యపు భాండాగారంగా మారిందని చెప్పారు. దేశంలో తెలంగాణను నెంబర్ వన్ గా  సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని, గతంలో పనుల కోసం తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేవారని, ఇప్పుడు పనుల కోసం ఇతర రాష్ట్రాల వాళ్లు తెలంగాణకు వలస వచ్చే పరిస్థతి  ఏర్పడిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.