రేవంత్​, ఈటలకు వాతలే మిగులుతయ్​ : కవిత

రేవంత్​, ఈటలకు వాతలే మిగులుతయ్​ : కవిత
  •     సొంత వ్యూహాలతోనే రెండు చోట్లకేసీఆర్​ పోటీ
  •     ఎన్నికల ముందు వచ్చే గాంధీలు రెడ్డిలు మనకెందుకు: ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, వెలుగు :  ముఖ్యమంత్రిగా, బీఆర్ఎస్​పార్టీ అధ్యక్షుడిగా, జాతీయస్థాయి నాయకుడిగా సీఎం కేసీఆర్ ఓ​వ్యూహం ప్రకారం రెండు చోట్ల పోటీ చేస్తుంటే టీపీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి బీజేపీకి చెందిన ఈటల రాజేందరన్న కూడా రెండు సెగ్మెంట్ల నుంచి పోటీ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం సాయంత్రం ఆమె బోధన్​లోని శక్కర్​నగర్​మైదానంలో కుల సంఘాల గర్జన పేరుతో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.

‘రకరకాల వ్యూహాలతో కేసీఆర్ ​రెండు చోట్ల పోటీ చేస్తుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రేవంత్​రెడ్డి, ఈటల రాజేందర్​ తీరుంది. వారికి వాతలు మాత్రమే మిగులతయ్. రిజల్టేమీ ఉండదు. వారు మూడు చోట్ల పోటీ చేసినా అల్టిమేట్​గా గెలిచేది మాత్రం బీఆర్ఎస్​ పార్టీయే. కేసీఆర్​ద్వారా రాష్ట్రానికి బలమైన పునాదులు పడ్డయ్.​ మరింత ఎదిగే రోజులు ముందున్నయ్. నీళ్లు, నిధులు, విద్యుత్​లో మిగులు సాధించాం. పిల్లల చదువులపై ఫోకస్​పెట్టాం.  

ఎన్నికల్లో మాత్రమే కనబడే గాంధీలు, రెడ్డీలు మనకు వద్దు’ అన్నారు. ‘ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం. చిత్తశుద్ధితో ఇక్కడి అభివృద్ధిని చూడాలె. బీసీలపై నిజమైన ప్రేముంటే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్​ఇవ్వాలె. బీసీ గణన ప్రకటించాలె. ఉట్టిమాటలు చెప్పొద్దు. రేపో, ఎల్లుండో వచ్చే రాహుల్​గాంధీ తీరు అంతే. రూ.4 వేల కోట్ల డబ్బు ఖర్చు చేసి కాంగ్రెస్​గవర్నమెంట్​హయాంలో చేసిన కులగణన రిపోర్టు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలె. బీజేపీ, కాంగ్రెస్​మొసలి కన్నీళ్లకు కరగొద్దు’ అని కవిత సూచించారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేయించినందున కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు అర్హులకు అందించగలుగుతున్నామన్నారు. 

ఎన్నికల కోసం బీసీలపై ప్రేమ 

కేంద్రంలో ప్రధాని మోదీ గవర్నమెంట్​బీసీలను మోసం చేస్తుంటే పనికి రాని ప్రతిపక్షంగా కాంగ్రెస్​ మారిందని ఎమ్మెల్సీ కవిత సోమవారం నిజామాబాద్​మీడియా సమావేశంలో విమర్శించారు. ‘బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్​ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనడం విడ్డూరం. వారు గెలిచేది లేదు బీసీని సీఎంను చేసేదీ లేదు. కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల కోసం చేసే బీసీ డిక్లరేషన్​తో వారి పాపాలు తొలిగిపోవు. కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్​ అర్బన్​లో ఎలా చెల్లుతుంది?’ అని షబ్బీర్​అలీని ఉద్దేశించి కామెంట్​ చేశారు. ఆమె వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పొన్నాల లక్ష్మయ్య, కాసాని జ్ఞానేశ్వర్​, అర్బన్​, ఆర్మూర్​ అభ్యర్థులు గణేష్​గుప్తా, జీవన్​రెడ్డి తదితరులు ఉన్నారు. బోధన్​ సభలో ఎంపీ బీబీపాటిల్​, అక్కడి ఎన్నికల అభ్యర్థి  షకీల్​ ఆమెర్​, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్​ పాల్గొన్నారు.