
ఖమ్మం టౌన్, వెలుగు : ‘నేను బహిరంగంగా కొట్లాడడం లేదని చాలా మంది అడుగుతున్నారు.. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే.. ప్రజా సమస్యలపై ఎన్నికల ముందు కంటే.. ఇప్పుడు క్రియాశీలకంగా పనిచేస్తున్నాం’ అని టీజేఎస్ అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం స్పష్టం చేశారు. ఖమ్మంలోని ప్రశాంతినగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీస్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం కొలిపాక ఫంక్షన్హాల్లో జరిగిన మీటింగ్లో మాట్లాడారు.
సుబ్లేడును మండలం చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థిరపడిన ఆదివాసీలకు ట్రైబల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని, చర్ల మండలంలో కాలేజీ, జూలూరుపాడులో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మంలోని ఇరిగేషన్ ప్రాజెక్ట్లను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతభత్యాలు పెంచాలని, ఆర్టీసీ, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.
కేంద్రం పరిమితి విధించడంతో దక్షిణాది రాష్ట్రాలకు అప్పు పుట్టడం లేదన్నారు. డీలిమిటేషన్ పేరుతో సీట్లను కుదించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. సీట్లను కుదించడం వల్ల ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఉపయోగమేమీ లేదని ముందే చెప్పామన్నారు. సర్దార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోపగాని శంకర్, డాక్టర్ కృష్ణారావు, పాషా పాల్గొన్నారు.