మోదీ 11 ఏండ్ల పాలన.. 5 ట్రిలియన్ డాలర్ల కల కోసం పునాది.. వికసిత్ భారత్ దిశగా అడుగులు

మోదీ 11 ఏండ్ల పాలన.. 5 ట్రిలియన్ డాలర్ల కల కోసం పునాది.. వికసిత్ భారత్ దిశగా అడుగులు

21వ శతాబ్దాన్ని చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే... నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి అయిన 2014 సంవత్సరం నుంచి  ఒక ప్రకాశవంతమైన అధ్యాయం భారతదేశ చరిత్రలో  కనిపిస్తోంది.  ఈ 11 సంవత్సరాల ప్రధాని మోదీ పాలన కేవలం భారతదేశ ప్రభుత్వ పనితీరును లేదా దాని విధానాలను మాత్రమే మార్చలేదు,  మన దేశ ‘సోల్​’ను కూడా మార్చిందని ఈ అద్భుత ప్రగతి ప్రయాణానికి మద్దతు ఇచ్చే వ్యక్తిగా నేను పూర్తి నమ్మకంతో చెబుతున్నాను. 

నేను బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధిగా మాత్రమే కాకుండా, గతంలో  దశాబ్దాలుగా తప్పిపోయిన అవకాశాలు, విధానపరమైన లోపాలు, ప్రేరణ లేని పాలనలో జీవించిన భారతీయుడిగా మాట్లాడుతున్నాను.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, వ్యూహాత్మక నిర్మాణంలోకి తీసుకువచ్చిన టెక్టోనిక్ మార్పును నేను ప్రత్యక్షంగా చూశాను.


భారతదేశం ఒకప్పుడు నిస్తేజంగా, ఏమాత్రం చురుకుదనంలేని  నెమ్మదిగా కదిలే పాలనకు, ఎప్పుడూ స్తబ్ధతగా కదలని ఫైళ్లకు, చాలా  అరుదుగా వెలుగులోకి వచ్చే కీలక నిర్ణయాలకు ప్రసిద్ధి చెందింది. నరేంద్ర మోదీ భారతదేశ ప్రధానమంత్రిగా దేశ పాలక పగ్గాలు చేపట్టిన తరువాత ఆ కథనాన్ని మార్చేశారు. ఎటువంటి కీలక నిర్ణయమైనా అలసత్వం లేకుండా, వెనుకంజ వేయకుండా,  ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం మనం చూశాం.  

ఆర్టికల్ 370 రద్దు,  గూడ్స్ అండ్​ సర్వీస్​ ట్యాక్స్ (జీఎస్టీ) అమలు,  డిమానిటైజేషన్, ట్రిపుల్ తలాక్ రద్దు,  పౌరసత్వ సవరణ చట్టం, మొదలైన దేశ చరిత్రను మలుపు తిప్పిన నిర్ణయాలను మోదీ అమలుచేశారు. ఎంతటి ప్రతిఘటన ఎదురైనప్పటికీ  దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలనే ఆయన సంకల్పానికి ఇవి కొన్ని ఉదాహరణలుగా చెప్పవచ్చు. 

అదేవిధంగా సంకీర్ణ రాజకీయాల నుంచి  భారత రాజకీయ దృశ్యాన్ని సంఘటిత జాతీయ దృక్పథంగా మార్చారు. 'ఒకే దేశం, ఒకే ఆకాంక్ష' అనే ఆలోచన ‘సంస్కరణ, పనితీరు,  పరివర్తన’ ఆధారంగా నిర్మించిన ఆయన పాలన నమూనా స్పష్టంగా కనిపిస్తోంది. 

5 ట్రిలియన్​ డాలర్ల కల కోసం పునాది 

మోదీ పాలనలో 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు పునాది  పడింది.  ఇటీవలి  చరిత్రలో  ఏ నాయకుడు   భారత ఆర్థిక వ్యవస్థలో ఇంత సమగ్ర  ఆర్థిక పరివర్తనకు నాయకత్వం వహించలేదు.  దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు భారతదేశాన్ని ఒకే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఏకం చేసింది.  నోట్ల రద్దు ఒకవిధంగా అంతరాయం కలిగించేది అయినప్పటికీ, ఆర్థికవ్యవస్థ డిజిటలైజేషన్ వైపు మారే విధంగా ఉత్ప్రేరకంగా నిలిచింది. జన్​ధన్​ యోజన 500 మిలియన్లకుపైగా భారతీయులను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చింది. 

ఇది ఏ ఆర్థికవేత్త కూడా ఊహించని ఆర్థిక విప్లవం. ఇప్పుడు భారతదేశం డిజిటల్ ఆర్థిక పర్యావరణ వ్యవస్థకు శక్తినిస్తుంది. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా,  ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు భారతదేశ ఆర్థిక స్వావలంబన కోసం నిర్మాణాత్మక చట్రాన్ని ఏర్పాటు చేశాయి.  ప్రధాని మోదీ 
నాయకత్వంలో  అగ్రదేశాలకు తీసిపోనివిధంగా దీటుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ (ఏఐ),  సెమీకండక్టర్లు, అంతరిక్షం, పునరుత్పాదక శక్తిలో ముందుండాలని కోరుకుంటున్నాం. భారతదేశం సేవారంగంపై ఆధారపడిన  ఆర్థిక వ్యవస్థ నుంచి తయారీ, ఆవిష్కరణ శక్తి కేంద్రంగా మారుతోంది.

సామాజిక మౌలిక సదుపాయాలు

సామాజిక మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు దేశంలో ప్రతి భారతీయుడిని సాధికారపరచడంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఇంతకుముందు ఎయిర్  కండిషన్డ్  గదులలో  రూపొందించిన విధానాల రూపకల్పనను  వదిలేసి,  సామాన్యుడిపై  ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రధాని మోదీ ప్రత్యేకతను చాటింది.  స్వచ్ఛ్​భారత్  కేవలం మరుగుదొడ్ల గురించి కాదు.  

అది సామాన్య ప్రజానీకానికి అందించిన గౌరవం.  ఉజ్వల కేవలం గ్యాస్ సిలిండర్ల గురించి కాదు,  అది  మహిళల ఆరోగ్యం,  శ్రమ విముక్తి గురించి, పర్యావరణం గురించి తెలుపుతోంది.   హర్ ఘర్ జల్ కేవలం నీటి గురించి కాకుండా ప్రజా జీవనం,  జీవన సౌలభ్యం గురించి తెలియజేస్తోంది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీల నూతన వ్యవస్థ  దళారులను,  మధ్యవర్తులను తొలగించింది. అభివృద్ధి ఫలాలు ఉద్దేశించిన పౌరులకు చేరేలా చూస్తున్నాయి.   

డిజిటల్  ఇంక్లూజన్​, ఆధార్ ఇంటిగ్రేషన్, మొబైల్ వ్యాప్తి మోదీ పాలనలో ఇంతకుముందెన్నడూ లేని ఉన్నత స్థాయికి చేరుకున్నది. ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య పథకాలు పేదలకు ఒక దశాబ్దం క్రితం ఊహించలేని భద్రతాపరమైన రక్షణ వలయాన్ని అందించాయి. విద్యా సంస్కరణలు,  నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీ (ఎన్​ఈపీ) 2020,  విస్తృతంగా పెరుగుతున్న కేంద్ర సంస్థలు  భవిష్యత్ తరాల సామర్థ్య నిర్మాణానికి లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. 

 ప్రపంచ వేదికపై..

2014కి ముందు భారతదేశం తరచుగా ప్రపంచ వేదికలలో తన ఉన్నతస్థాయి కంటే తక్కువగా పరిగణించడం జరిగేది. అయితే, ప్రధాని మోదీ వ్యూహాత్మక దౌత్యం ప్రపంచ వేదికలపై ఆ కథనాన్ని తిప్పికొట్టింది.  క్వాడ్,  జీ20, బ్రిక్స్ లేదా కాప్​ శిఖరాగ్ర సమావేశాలు అయినా భారతదేశం కేవలం ఉనికిలో ఉండటమే కాదు. ఆయా వేదికలపై జరిగే సంభాషణకు కేంద్రంగా మారింది. 

ప్రపంచ దేశాలను కలవరపరిచిన కొవిడ్​–19 మహమ్మారి సమయంలో మన నాయకత్వం, ముఖ్యంగా వ్యాక్సిన్  మైత్రి ద్వారా మానవతా దృక్పథం కలిగిన మానవీయ, సమర్థవంతమైన భారతదేశం ఎలా ఉంటుందో  ప్రపంచానికి చూపించింది. ప్రధాని మోదీ మన విదేశాంగ విధానాన్ని దేశం మొత్తం గర్వించేవిధంగా మార్చేశారు.

  ఆయన గ్లోబల్​ ఎంగేజ్​మెంట్స్​ కేవలం ప్రతీకాత్మకమైనవి కావు. అవి వ్యూహాత్మక పొత్తులు, సాంకేతిక బదిలీలు, వాణిజ్య ఒప్పందాలు,  భౌగోళిక రాజకీయ పరపతిని తెలియజేస్తాయి. భారతదేశం నేడు ప్రపంచ వేదికల్లో ఒకరిని  సీటు అడగటం కాదు మన దేశమే ఇతర దేశాలకు ఒక స్థానాన్ని 
అందిస్తోంది.

దేశ భద్రతే ప్రధానం

భారతదేశం తన శత్రు దేశాల దూకుడును  ఇకనుంచి  నిశ్శబ్దంగా చూస్తూ  సహించదు. ‘ఉరి’ తర్వాత జరిగిన సర్జికల్ దాడుల నుంచి  పుల్వామా తర్వాత జరిగిన బాలకోట్ వైమానిక దాడుల వరకు  భారత్​ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసింది.  పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్న ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను నాశనం చేసింది.   ఖచ్చితమైన దాడులతో ఇటీవలి  చేపట్టిన ఆపరేషన్  సిందూర్​తో భారతదేశం దాయాది పాకిస్తాన్​కు  ఇచ్చిన  సందేశం చాలా  స్పష్టంగా ఉంది.  ప్రధాని మోదీ నాయకత్వంలో కొత్త భారతదేశం దాని సరిహద్దులను, పౌరులను,  గౌరవాన్ని కాపాడుకుంటోంది.  సాయుధ దళాల ఆధునికీకరణ, స్వదేశీ రక్షణ ఉత్పత్తికి ప్రోత్సాహం,  బలమైన అంతర్గత భద్రతా చర్యలు  బలంగా ఉన్న  భారతదేశాన్ని
 ప్రతిబింబిస్తున్నాయి. 

2047 నాటికి వికసిత్​ భారత్

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలోని  ఎన్డీయే పాలన 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో.. భారతదేశం ఉన్నతంగా ఎదుగుతుందా లేదా అనేది ప్రశ్నే కాదు.  ఎంత వేగంగా, ఎంత దృఢంగా ఎదుగుతుంది అనేదానిపై దృష్టి కేంద్రీకరించాలి.  2047 నాటికి వికసిత్​ భారత్​ దార్శనికత కేవలం మోదీ ఎన్నికల వాగ్దానం కాదు.  

సంపూర్ణంగా  అభివృద్ధి చెందిన, స్వావలంబన కలిగిన, ఆవిష్కరణలపై ఆధారపడిన, ప్రపంచవ్యాప్తంగా  సూపర్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా భారతదేశం మారాలనేది జాతీయ ఆకాంక్ష.  సమర్థవంతమైన పాలన అనేది ఒక్క ఉన్నత వర్గాలకే  కాదు.  చివరి  పౌరుడికి  సైతం అందించే వాగ్దానం.  11 సంవత్సరాలుగా, ప్రధాని  మోదీ భారతదేశాన్ని సాటిలేని స్పష్టత, ధైర్యం, దృఢ నిశ్చయంతో నడిపించారు. 

ఆధునిక భారతదేశంలో నాయకత్వం అంటే ఏమిటో ఆయన తిరిగి నిర్వచించారు. నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం ప్రగతికథ ఇంకా ఆవిష్కృతం అవుతూనే ఉంది.  దాని చివరి అధ్యాయాలు చరిత్ర పుస్తకాలలోనే కాదు,  ప్రతి భారతీయుడి రూపాంతరం చెందిన జీవితాలలో బంగారు సిరాతో లిఖితం అవుతాయి.

సాంస్కృతిక పునరుజ్జీవనం

ప్రధాని మోదీ భారతదేశ నాగరికత, సాంస్కృతిక పునరుజ్జీవనంలో తనవంతు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి భారతీయుడు గర్వించేలా కృషి చేస్తున్నారు.  అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణం కేవలం ఒక మతపరమైన మైలురాయి మాత్రమే కాదు.  ఇది ఒక నాగరిక దిద్దుబాటుగా చెప్పవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, సంస్కృత ప్రచారం, గిరిజన వారసత్వ ఉద్ధరణ,  వికసిత్​ భారత్ సంకల్ప్ వంటివి భారతదేశ విజ్ఞానం గురించి లోతుగా తెలిసిన నాయకుడిని ప్రతిబింబిస్తున్నాయి.  భారతీయులు ముఖ్యంగా ప్రపంచ దేశాల ముంగిట  మన దేశ యువత  గర్వంగా వారి సాంస్కృతిక గుర్తింపును తిరిగి పొందడంలో సహాయకారిగా నిలిచారు.  భారతదేశం కీర్తిపతాక పునఃఆవిష్కరణ  వేగంగా  జరుగుతోంది.  

- కె. కృష్ణ సాగర్ రావు, 
బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, 
నేషనల్​ బిల్డింగ్ ఫౌండేషన్ చైర్మన్